దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాలకు 50 మందికి మించి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి నిరాకరించింది.
బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ఐదుగురికి కంటే మించి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మద్యం సేవించడం, పాన్, గుట్కా, పొగాకు నమలడం నిషేధించారు.
గతంలో మొదటి దశ లాక్ డౌన్ మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు 21 రోజులు అమలుపరచగా, రెండవ దశలో ఏప్రిల్ 15 నుండి మే 3వరకు 19 రోజుల పాటు పొడిగించారు. రేపటితో లాక్ డౌన్ 2.0 ముగుస్తుండటంతో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ 3.0 ను మే 17 వరకు అమలుపరచనున్నారు