
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులూ సన్నద్ధమవుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుని తమ పార్టీకి తిరుగు లేదని చాటాలని తహతహలాడుతోంది.
ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు ఇప్పటికే జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా టీఆర్ఎస్ ఇన్చార్జీలనూ నియమించింది. ఉమ్మడి వరంగల్-–ఖమ్మం– నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇన్చార్జీలు, నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఈ ఎమ్మెల్సీ స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా పోటీచేస్తున్నారు కాబట్టి. అందుకే.. ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్దసంఖ్యలో చేపట్టాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర మరువలేనిది. అందుకే.. వీలైనంత వరకూ కోదండరాంకు ప్రజా మద్దతు లేదని తేల్చాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా జరుగుతూ ఉంటాయి. విద్యావంతులు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేస్తుంటారు. పైగా.. ఉద్యమంలో కోదండరాంతో అనుబంధం ఉన్న యువతే ఎక్కువ. మరి కేటీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో ..!?
వరంగల్– ఖమ్మం– నల్గొండ జిల్లాల నుంచి పట్టభద్రుల ప్రతినిధిగా కోదండరాం శాసనమండలిలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు. అయితే.. కోదండరాం ఒక్క సారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే.. ఆయనకు వచ్చే మైలేజీ కూడా వేరుగా ఉంటుంది.