Homeజాతీయ వార్తలుదీటైన పోటీనిచ్చిన కోదండరాం, నాగేశ్వర్

దీటైన పోటీనిచ్చిన కోదండరాం, నాగేశ్వర్

Kodandaram, Nageshwar
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎట్టకేలకు పోలింగ్‌ ముగిసింది. గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు ధీమాతో ఉన్నారు. పోలింగ్‌ ముగియడంతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్‌ జరిగిన సరళి తమ కంటే తమకే అనుకూలమంటూ అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ఆ మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా తమ సత్తా చాటుతామని అంటున్నారు.

Also Read: మున్సి‘పోరులో’ కనిపించని బీజేపీ అడ్రస్‌.. పొత్తుపై జనసేనాని దీర్ఘాలోచన

నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌లో గిరిజన నేత రాములునాయక్‌కు టికెట్‌ ఇవ్వడం కలసి వస్తుందని, పోలింగ్‌ సరళి కూడా ఇదే చెబుతోందని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. సామాజిక కోణంలో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులుండటం, మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతకు తాము టికెట్‌ ఇవ్వడం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. పాలమూరు జిల్లాలో స్థానికత పనిచేసిందని, రాజకీయంగా తమ అభ్యర్థి చిన్నారెడ్డి అనుభవజ్ఞుడు కావడం లాభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై ఎలాగూ వ్యతిరేకత ఉందన్న ధీమా కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లిన కమలనాథులు కూడా రెండు స్థానాల్లో విజయం తమదేనని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని పట్టభద్రులు విశ్వసించారని, తమకు ఎన్నికల ప్రచారంలో లభించిన స్పందనతోపాటు పోలింగ్‌ జరిగిన సరళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌పై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనందున అనివార్యంగా తమను ఎంచుకున్నారని, మోదీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విజయం తమదేనన్న విశ్వాసం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సిట్టింగ్‌ స్థానం రంగారెడ్డితోపాటు బోనస్‌గా నల్లగొండ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని, ఇదే ఊపుతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు వెళతామని కమలనాథులు చెబుతుండడం గమనార్హం.

Also Read: బీజేపీపై పొత్తు ఉండాలా..? వద్దా..?

పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల్లో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఏ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినా, రెండో ప్రాధాన్యత విషయంలో క్రాస్‌ ఓటింగ్‌ తథ్యమని, ఈ పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి అన్ని ప్రధాన రాజకీయ పక్షాల్లోనూ కనిపిస్తోంది. పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి నల్లగొండ నుంచి ప్రొఫెసర్‌ కోదండరాం గెలుస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద ప్రొఫెసర్‌ను ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న సంబంధాలు, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్రను పరిగణనలోనికి తీసుకుని పట్టభద్రుల పోలింగ్‌ జరిగిందనే వాదన ఆసక్తిని కలిగిస్తోంది.

హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ గెలుపుపై కూడా పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ ప్రాధాన్యత ఎవరికి వేసినా, రెండో ప్రాధాన్యత కింద నాగేశ్వర్‌ను ఎంచుకున్నారనే ప్రచారం పట్టభద్రుల్లో సాగుతోంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వస్తాయి.. ఎన్ని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వస్తాయన్న దానిపై ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular