Kodali Nani- Balineni Srinivasa Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు పలు సందర్భాల్లో సూచించిన ఆయన కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేయబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో జగన్ సాహసం చేస్తారా? అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి వర్గంలో జగన్ మరోమారు అవకాశం కల్పించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. వీరు ఇద్దరు మంత్రి వర్గం -1 లో పదవులు అనుభవించినవారే. ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమలో పార్టీలో నెలకొన్న అసంతృప్తిని, పార్టీని ఎన్నికల నాటికి సిద్ధం చేయాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ తో సీఎం జగన్ భేటీకానున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్లో జగన్ పాలన రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఉత్తరాంధ్ర ప్రజల మైండ్ సెట్ మారుతుందని ఆశించిన ఆయనకు ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరాశను మిగిల్చాయి. అక్కడ మంత్రులకు బాధ్యతలు అప్పగించినా, సరిగ్గా పనిచేయలేదని అభిప్రాయానికి వచ్చారు. అటు వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమలోనూ పరాభవం ఎదురైంది. ఎమ్మెల్సీ పలితాలను చూసి జగన్ తీవ్ర అసహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి రాజకీయాలపై పెద్దగా స్పందించడం లేదు. వై నాట్ 175 అన్న నినాదంపై మౌనం వహించేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. చంద్రబాబు అసలు గెలవకూడదని భావిస్తున్న జగన్కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేసి మరీ తెలుగుదేశానికి అవకాశం కల్పించారు. దీనితో జగన్ కేబినేట్ లో కొత్తవారికి అవకాశం కల్పించి, ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రాబోవు ప్రభుత్వం వరకు వేచి చూసేందుకు సిద్ధపడక, ప్రస్తుతం మంత్రి పదవిని ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని వార్తలు రావడంతో వినతులు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువైపోయింది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సెల్ప్ గోల్ అవుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి మొదలైంది.