తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ కార్పొరేటర్ కారుకు ఆందోళనకారులు నిప్పంటించారు. కార్పొరేటర్ పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. ఈ సంఘటనలో కార్పొరేటర్ కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ప్రాణనష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కైకొండాయగూడెంకు చెందిన తేజ్ అనే యువకుడు ఈనెల 18న అనుమానాస్పదంగా మృతిచెందాడు. తేజ్ మృతికి ఖమ్మం ఒకటో డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమంటూ గతంలోనే బంధువులు ఆరోపించారు. అయితే మంగళవారం సదరు కార్పొరేటర్ కైకొండాయగూడెం వస్తున్నట్లు తెలుసుకున్న తేజ్ బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ అటువైపు రాగానే వాహనాన్ని ఆపి దాడికి యత్నించడంతో ఆయన పక్కనే స్కూల్లోకి వెళ్లి దాక్కున్నాడు.
ఆందోళనకారులను నుంచి తనను రక్షించాలని రామ్మూర్తి నాయక్ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులకు అక్కడి చేరుకొని రాంమ్మూర్తిని వారి నుంచి విడిపిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామ్మూర్తిని పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఆందోళనకారులు అడ్డుకొని అతడి కారుకు నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు వెంటనే తెరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ప్రజలను భయాందోళనకు గురిచేసింది.