తెలంగాణలో భూస్వాములు ఎవరూ లేరట. ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలి వేదికగా మాట్లాడిన మాటలు. ఇది ఎంతవరకు నిజం అంటారు. అంతేకాదు 95 శాతం భూములు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వద్దే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయ్యా.. కేసీఆరూ తెలంగాణలో భూస్వాములు లేనప్పుడు మరి ఈ ఉద్యమాలు ఎందుకు పుట్టుకొచ్చినట్లు..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో భూస్వామి తన ఒక్కరి పేరు మీదనే కాకుండా బినామీ పేర్ల మీద కూడా భూములు కొనుగోలు చేయొచ్చు కదా..? ఒకసారి రికార్డులన్నీ చెక్ చేయండి అంటూ కోరుతున్నారు.
Also Read: విపక్షాల గొంతు కేసీఆర్ నొక్కేస్తున్నారా? సీతక్క ఆవేదన ఇదీ..
రాష్ట్రంలో భూస్వాములెవరూ లేరని.. 98.38 శాతం మంది రైతులకు పదెకరాల్లోపు భూమి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో ఆరు వేల మంది భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు.. ఇప్పుడు 60.95 లక్షల మంది రైతుల ఆధీనంలోకి వచ్చాయన్నారు. కేవలం ఐదు కులాల వారి వద్దే 95 శాతం భూములున్నాయని చెప్పుకొచ్చారు. సోమవారం శాసన మండలిలో కొత్త రెవెన్యూ యాక్ట్పై చర్చకు సీఎం కేసీఆర్సమాధానం చెప్పారు. బడా భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు.. కౌలుదారుల రక్షణ కోసం రికార్డుల్లో అనుభవదారు కాలమ్ పెట్టారన్నారు. ‘ఇప్పుడు బంగ్లాస్వామి.. కారుస్వామి.. భూస్వామి.. అంటూ ఎవరూ లేరు. గుంట భూమి ఉన్నోళ్లు కూడా భూస్వాములే.. వాళ్లు కాక ఇంకా చాలామంది స్వాములు ఉన్నరు. వాళ్ల కథ ఏందో మనకు తెలుసు. అనుభవదారు కాలమ్తో కొందరు గద్దల్లా భూములు తన్నుకుపోతున్నరు. ఇష్టమొచ్చినట్టు ఇంజెక్షన్ ఆర్డర్లు తెస్తే చిన్న రైతులు ఎటు పోవాలే.. భూమి ఉన్నందుకే వాళ్లు శాపగ్రస్తులు కావాల్నా, ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారులు.. భూ ప్రాపర్టీకే ఎందుకు’’ అని పేర్కొన్నారు.
రాష్ర్టంలో మొత్తం 60,95,134 మంది పట్టాదారులు ఉండగా.. 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.
రాష్ట్రం వచ్చాక భూముల రేట్లు అద్భుతంగా పెరిగాయని, ఎక్కడో రిమోట్ ఏరియాలో తప్ప ఎకరం రూ.10 లక్షలకు కూడా దొరకట్లేదని కేసీఆర్ అన్నారు. భూముల రేట్లు పెరగడంతో లాండ్ మాఫియా కూడా పెరిగిందన్నారు.మోడీ సర్కారు తెలంగాణలోని కొన్ని మండలాలు లాక్కొని ఆంధ్రాకి ఇచ్చేసిందని.. సీలేరు కూడా ఇచ్చేసి తెలంగాణకు శాశ్వత నష్టాన్ని చేసిందన్నారు.
Also Read: మళ్లీ రవి ప్రకాష్ చేతికి టీవీ 9..?
రాష్ట్రంలోని రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో ఇక అవినీతికి ఆస్కారమే ఉండదన్నారు. ఒక్క రూపాయి లంచం ఇచ్చే పనిలేకుండా భూముల మ్యుటేషన్ అయిపోతుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదన్నారు. సబ్ రిజిస్ర్టార్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, అప్డేషన్ కాపీలు వెంటనే వస్తాయన్నారు.