Homeజాతీయ వార్తలుKCR - Gaddar: వైరల్ ఫోటో: గద్దర్ ను మూడు గంటలు ఎండలో నిలబెట్టిన...

KCR – Gaddar: వైరల్ ఫోటో: గద్దర్ ను మూడు గంటలు ఎండలో నిలబెట్టిన కేసీఆర్

KCR – Gaddar: “గద్దరన్న రెండు సార్లు ముఖ్య మంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించిండు. ఈ ఫోటో ఫిబ్రవరి 23, 2023 న ప్రగతి భవన్ వెళ్లి మూడు గంటలు గేటు దగ్గర ఎండలో కూర్చొని కెసిఆర్ ను కలిసేందుకు అనుమతి కోరిండు. బతికి ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడక అవమానించిండు, చనిపోయాక అధికారులు లాంఛనాలు అని గద్దర్ అన్న ఇంటికి పోయి ఓట్ల వేట మొదలుపెట్టిండు.” ఇదీ వీ ఆర్ ఎస్ తీసుకున్న ఐఏఎస్ ఆకునూరి మురళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ట్వీట్. ఆ ట్వీట్ లో గద్దర్ ఎర్రటి ఎండలో కూర్చున్న ఒక ఫోటో కనిపిస్తోంది. మురళి చెప్పినట్టు గద్దర్ ఎదురుచూసి చూసి చివరికి నిరాశతో ఇంటికి వెళ్లి పోయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పుడే కాదు మొదటి నుంచి గద్దర్ కు కేసిఆర్ కు ఎడమొహం పెడ మొహమే. ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో తన పాటతో మరొక స్థాయికి తీసుకెళ్లిన గద్దర్ ను కెసిఆర్ దూరమే పెట్టాడు. చివరికి ఒకే వేదిక పంచుకునేందుకు కూడా కెసిఆర్ పెద్దగా ఇష్టపడలేదు అని గద్దర్ అంతరంగీకులు అంటూ ఉంటారు. గద్దర్ కన్నుమూసిన తర్వాత కూడా అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఇదే రకమైన ధోరణి అవలంబించింది.

గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసినప్పటికీ శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కేసిఆర్ ఇష్టపడలేదు. అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చివరికి కెసిఆర్ కొడుకు కేటీఆర్ నిండు శాసనసభలో గద్దర్ మృతికి సంబంధించి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం గద్దర్ మృతి చెందినప్పటికీ.. సోమవారం సాయంత్రానికి గాని గద్దర్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు కేసిఆర్ వెళ్లలేదు. అంటే దీనిని బట్టి కెసిఆర్ కు గద్దర్ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. తన కొడుకు చనిపోవడంతో ఆయన పేరు మీద ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని గద్దర్ అప్పట్లో ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా దీనికి ఒకే చెప్పింది. అయితే ఈ గ్రంథాలయానికి ఇచ్చే స్థలాన్ని మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించి తీసుకోవాలని గద్దర్ కు సూచించింది. అంత రేటు తాను చెల్లించుకోలేనని గద్దర్ చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గద్దర్ గులాబీ పాట పాడటం లేదని ప్రభుత్వం ఆయనను మరింత దూరంగా పెట్టింది. గోరటి వెంకన్న పలుమార్లు గద్దర్ తో దౌత్యం నడిపినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇది సహజంగానే కెసిఆర్ కు కోపం తెప్పించిందని, అందుకే గద్దర్ ను దూరంగా ఉంచాలని ఆయనకు సంబంధించిన వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బతికి ఉన్నప్పుడు గద్దర్ కు ఎలాంటి అవమానం జరిగిందో ఆకునూరి మురళి చెప్పేదాకా తెలంగాణ సభ్య సమాజానికి తెలియదు. ప్రస్తుతం మురళి ట్విట్టర్ లో ఈ పోస్ట్ చేసిన తర్వాత కేసీఆర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular