Homeజాతీయ వార్తలుకేసీఆర్ ఎన్నికల హామీలు.. అమలైతే ఒట్టు?

కేసీఆర్ ఎన్నికల హామీలు.. అమలైతే ఒట్టు?

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు ఎన్నికల హామీల్లో ప్రజలను ఓట్లు వేయించుకొని ఫ్లేటు ఫిరాయించాడని టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ గురించి ప్రతిపక్షాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు హామీలు గుర్తుకు వస్తాయని నియోజకవర్గంపై వరాలు కురిపించి గెలుస్తారని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

-దుబ్బాకలో మల్లన్న సాగర్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఇటీవల ఎన్నికలు జరిగిన దుబ్బాక లో గెలుపుకోసం సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రధానంగా అక్కడి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం ఇస్తామన్న హామీని కేసీఆర్ పూర్తిగా నెరవేర్చలేదు. ఇక డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ఇప్పటిదాకా నెరవేర్చలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో దాదాపు 20వేల కోట్ల వరకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వాటిని అలు చేసిన దాఖాలాలు లేవని నేతలు విమర్శిస్తున్నారు. దుబ్బాకలోనే సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధర హామీనిచ్చిన కేసీఆర్ వాటిని పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఆ ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కుతున్న పిరస్థితి నెలకొంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు.. భూసంస్కరణలు, ధరణి విషయంలో కేసీఆర్ హామీలు అమలు కాలేదని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న కేసీఆర్ అదీ నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఉద్యోగాల ప్రకటన చేసి ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వలేదని అంటున్నారు.

-నాగార్జునసాగర్ హామీల పరంపర ఏమైంది?
నాగార్జున సాగర్ వేళ సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గంలో నల్గొండ జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు ప్రకటించారు. ఎన్నికలయ్యాక వాటిని మరిచిపోయారని అంటున్నారు. దాదాపు 40వేల కోట్ల హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో సాగర్ ఎన్నికల సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని నియోజకవర్గంలోని నేతలు విమర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ లోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అది ఇప్పటికీ ముందడుగు పడలేదని సమాచారం. ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రైతు బంధు డబ్బులు జమ చేస్తానని చెప్పినా ఇప్పటికీ కొందరికీ అందలేదని రైతులు ఆరోపిస్తున్ానరు. ఇక సాగర్ నియోజకవర్గంలో చేపట్టదలిచిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిందని.. మరో పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం 600 కోట్ల పనులకు అనుమతిచ్చినా అవి ఇంకా ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా ప్రారంభం కాలేదని తెలిసింది. ఇక నాగార్జున సాగర్ లోని బోతలపాలెం-వడపల్లి ఎత్తిపోతల పథకంకు రూ.229.25 కోట్లతో అనుమతిచ్చినా అదీ ముందడుగు పడలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇక సాగర్ కాల్వలపై దున్నపోతులగండి-బాల్నేపల్లి-చంపాల తండా ఎత్తిపోతల పథకానికి 219 కోట్లతో అనుమతిచ్చినా అదీ ప్రారంభం కాలేదంటున్నారు. ఇక మూసీనదిపై కేశాపురం-కొండ్రపోల్ వద్ద ఎత్తిపోతల పథకంకు 75 కోట్లతో అనుమతిచ్చినా అదీ నెరవేరలేదంటున్నారు. ఇక నాగార్జున సాగర్ లో రిజర్వాయర్ ఫోర్ షోర్ లో నెల్లికల్ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు అనుమతిచ్చి 72 కోట్లు మంజూరు చేసినా ఇంతవరకు ముందుకు పడలేదని.. 4వేల ఎకరాల ఆయకట్టుకు నీరందడం లేదని అంటున్నారు.

-హుజూరాబాద్ లో ఇప్పుడు దళితబంధు హామీ
ఇప్పటిదాకా హైదరాబాద్ జీహెచ్ఎంసీ, దుబ్బాక, నాగార్జున సాగర్ లో ఇచ్చిన హామీలే ఇంకా కేసీఆర్ నెరవేర్చలేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం ఏకంగా ‘దళిత బంధు’ ప్రకటించారు. నియోజకవర్గంలోని దళితులకు ముందుగా కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పంచుతామంటున్నారు. ఇందుకు లక్షకోట్లు రెడీ చేస్తున్నట్టు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా.. సీఎం కేసీఆర్ దళిత బంధు పేరుతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడం ఓ అద్భుత అబద్దంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో లేని డబ్బులను ఎక్కడి నుంచి తెస్తారు. అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే తపనతో అమలుకు వీలు కాని హామీలు ఇవ్వడంపై ప్రతిపక్షాలు సైతం కన్నెర్ర జేస్తున్నాయి.

-కేసీఆర్ అమలు చేయనివి ఎన్నో..
ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు.మొదట్లో కొందరికీ పంచి మమ అనిపించారు. ఇక దళితుడినే సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చి తనే సీఎం అయ్యారు. ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పిన హామీలన్నీ ఇప్పటికీ నెరవేరకుండా ఉన్నాయి. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే అసలు ఈ దళితబందు పథకమైనా కొనసాగుతుందా? లేదా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఎన్నికల కోసం కాకుండా నిజాయితీగా అమలు చేయాలని కోరుతున్నాయి. కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకున్నా అవి అమలు వరకు వేరే విషయం ఉంటుందని సామాన్య ప్రజలు ఎగతాళి చేస్తున్న రోజులివి. అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం సీఎం తక్షణ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్తాయిలో మాత్రం పరిస్థితులు మరోరకంగా ఉంటున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ విచిత్రమైన హామీలు గుప్పిస్తూ ప్రజల్లో చులకన అయిపోతోంది. ఎందుకంటే లక్ష కోట్ల బడ్జెట్ అనేది అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా దొంగతంన చేస్తే తప్ప ఇంత భారీ మొత్తంలో సొమ్ము లభించదని తెలిసినా హామీలివ్వడం వెనుక ఆంతర్యమేమిటి? దళితులను లక్ష్యంగా చేసుకుంటే మిగిలిన వర్గాలు ఎటు వెళ్లాలి. బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రయోజనం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. గతంలో ఇచ్చిన హామీల సంగతేంటని అడుగుతున్నారు. పాలకులు ప్రకటించిన పథకాల వివరాలు వింటేనే ఏదో విధంగా ఉంటున్నాయని పెదవి విరుస్తున్నారు. రాజకీయాల కోసం ఇంత దారుణానికి ఒడిగడుతున్నారనే అపవాదు మూటగట్టుకుంటోంది. ఇవన్నీ చేస్తే సామాన్యుడి మీదే భారం పడుతుంది. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం ఎందుకు సాహసం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular