CM Jagan
AP Assembly Elections 2024 : ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అదంతా ఊహాగానమేనని తర్వాత తేలుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రాన్ని ఒప్పించినట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఉలుకు పలుకు లేకపోవడంతో జగన్ అంతటి సాహసం చేయరన్న టాక్ నడుస్తోంది. అదే వాస్తవం అయితే ఈపాటికే జగన్ సన్నాహాలు ప్రారంభించాలి కదా. కానీ అటువంటి సంకేతాలేవీ జగన్ సర్కార్ నుంచి కనిపించడం లేదు.
రాష్ట్రంలో విపక్షాలు బలపడుతున్నాయని.. షెడ్యూల్ వరకు వేచి చూస్తే నష్టం తప్పదని జగన్ భావిస్తున్నారని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగింది. పైగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉండడం.. సంక్షేమ పథకాలకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి రావడంతోఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీంతో ఉద్యోగుల జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనిని అధిగమించాలంటే ముందస్తు ఎన్నికలే శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు ఆ మధ్యలో ప్రచారం జరిగింది. అటు కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడిచింది. కానీ ముందస్తు సన్నాహాలేవి రాష్ట్రంలో కనిపించడం లేదు.
అయితే ముందస్తు అన్నది విపక్షాలను డిఫెన్స్ లో పడేయడానికే అన్న టాక్ నడుస్తుంది. ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇచ్చారని.. అందులో ఒక్కరోజు కూడా వదులుకోపోమని చాలాసార్లు జగన్ ప్రకటించారు. సీనియర్ మంత్రులు సైతం ఇదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ముందస్తుకు వెళితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. భయపడి ప్రభుత్వం ముందస్తుకు వెళ్లిందని.. విపక్షాలు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే కష్టమైనా నష్టమైనా షెడ్యూల్ వరకు వేచి చూసేందుకే జగన్ సర్కార్ సిద్ధపడుతోంది.
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. అధికార బి ఆర్ ఎస్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మిగతా రాజకీయ పక్షాలు సైతం ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. ఒకవేళ తెలంగాణతో పాటు ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈపాటికే సన్నాహాలు ప్రారంభం కావాలి. కానీ అటువంటివి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వము రాజధానుల అంశాన్ని సెట్ చేసే పనిలో పడింది. విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపు తో పాటు సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇవన్నీ కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వ చర్యను పరిశీలిస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది.