ఆనందయ్య నాటు మందులో శాస్త్రీయత ఉందా అని ప్రశ్నించే వారు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్తున్న కరోనా ట్రీట్ మెంట్ లో శాస్త్రీయత ఉందా అనేదానికి ముందు సమాధానం చెప్పాలి. సైన్స్- సైన్స్ – సైన్స్ అని గగ్గోలు పెడుతున్నవారు గత సంవత్సర కాలంగా భారతదేశంలో మెడికల్ రంగంలో మనం చూస్తుంది సైన్సే నా? ! అనేదానికి సమాధానం చెప్పాలి ! పెట్టుబడిదారుడు చేసే మోసానికి సైన్స్ ముసుగు తొడిగినంత మాత్రాన అది సైన్స్ అయిపోదు. సైన్స్ అంటే ఏదైనా రుజువులతో నిరూపితమై ఉండాలి. కరోనా పేరుతో ప్రచారంలో ఉన్నవాటిలో శాస్త్రీయత ఎక్కడ?
1. వైరస్, బాక్టీరియాలతో వచ్చే ఏ జబ్బులైనా ఒకసారి వస్తే మళ్లీ రావు (సూక్ష్మజీవి ఎన్నిసార్లయినా రావొచ్చు ) ఇది నిరూపితమైన సైన్స్.
కానీ కోవిడ్ మాత్రం మళ్లీ మళ్లీ వస్తుందట. మరి దీనికి ఆధారం ఏది?
2. ఏ సూక్ష్మజీవి దాడి చేసినా శరీరం యాంటీబాడీలు ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ జీవి వచ్చిన ప్రతిసారీ జీవితాంతం వాటిని ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఇది నిరూపితమైన సైన్స్.
కానీ కరోనాలో మాత్రం శరీరానికి ఆ శక్తి ఉండదట. యాంటీబాడీలు మళ్లీ రావట. మరి ఏ పరీక్షలు చేసి నిర్ధారించారు ఈ విషయాన్ని? !
3. ఏ జబ్బు కలిగించే సూక్ష్మజీవి అయినా సరే, ఒకసారి అది సోకితే ఇక వాళ్లకు వాక్సిన్ అవసరం ఉండదు. ఇది నిరూపితమైన సైన్స్.
కానీ కరోనా విషయంలో మాత్రం అది వచ్చిన వాళ్లకు కూడా వాక్సిన్ తప్పనిసరట!!! ఏ పరీక్షలు చేసి దీన్ని ధృవీకరించారు?
4. ఒకే ప్రాంతంలో నివసించే మనుషుల్లో ఒకరిలో అసలు లక్షణాలు కూడా కనిపించనంత తేలిగ్గా ఉంటూ మరొకరిలో ప్రాణం తీసేంత ప్రమాదకరం!!
ఇంతటి వ్యత్యాసం చూపించే సూక్ష్మజీవి మైక్రోబయాలజీ చరిత్రలోనే లేదు. కరోనా విషయంలో దీన్ని ఏ పరీక్షలు చేసి ఆ విధంగా తేల్చి చెప్పారు? !
5. మన శరీరంలోకి వైరస్ సహజంగా వచ్చినప్పుడు తర్వాత దానిలో ఎన్ని మ్యుటేషన్స్ వచ్చినా సరే వాటన్నిటికీ శరీరం యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కానీ వైరస్ లోని చిన్న భాగంతో టీకా తయారు చేసినప్పుడు ఆ భాగంలో మ్యుటేషన్ జరిగితే ఇక ఆ టీకా పని చేయదు. ఇది నిరూపితమైన సైన్స్.
కానీ కరోనాలో దీన్ని రివర్స్ చేసి సైన్స్ ని తల్లకిందులు చేసేశారు. ఇదేనా శాస్త్రీయత అంటే?
6. అసలు పాండెమిక్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? ఎలా పోతుంది? అనే దాని మీద కనీస అవగాహన ఉన్నవాళ్లు ఎవ్వరూ డిస్టెన్స్ తో, మాస్కులతో కరోనా రాకుండా కాపాడుకోవచ్చు లాంటి జోక్ లు వేయరు.
మనిషి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతూ, కలలో కూడా మాస్క్ తీయని వాళ్లకు కూడా కరోనా ఎందుకు వస్తోంది? బాక్టీరియా కూడా ఈజీగా దూరిపోయే మాస్క్ నుంచి వైరస్ మాత్రం వెళ్లదట.
ఇదేనా సైన్స్? వైరస్ కూడా దూరలేని మాస్క్ పెట్టుకుంటే గాలి కూడా వెళ్లక డైరెక్ట్ గా పైకి పోతాం.
7. ఎఫికెసీ డేటా లేని, కనీసం ఎక్స్ పైరీ డేట్ లేని వాక్సిన్ జంతువుల మీద ప్రయోగించినట్టు మనుషుల మీద ప్రయోగిస్తున్నారు.
* ఇది అశాస్త్రీయం కాదా?
నాటు ముందుకి డేటా అడిగేవాళ్ళు వాక్సిన్ కి ఎందుకు డేటాను అడగట్లేదు?
రోజుకో మందు పేరు చెబుతారు. దాన్ని ప్రజల మీద రుద్దుతారు. తర్వాత పనిచేయదని మానేస్తారు. మళ్లీ ఇంకోటి.
ఆ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎప్పుడు ఏది మాట్లాడుతుందో దానికే అర్థం కాదు. రెమిడీస్వెర్ ని ప్రోటోకాల్ నుంచి తొలగించినా మనవాళ్ళు మాత్రం దాంతో కోట్ల బిజినెస్ చేసుకున్నారు.
ఇదేనా శాస్త్రీయత? దీని వల్ల నష్టపోయిన జనాల గతేంటి?
*సైన్స్ చరిత్రలో ఇంతటి దారుణాలు ఎప్పుడైనా చూశామా?
సైన్స్ ని ఉద్దరించేందుకు కంకణం కట్టుకున్న వీళ్లంతా ఈ సైంటిఫిక్ కాదని, ఫేక్ సైన్స్ ని ఎందుకు ప్రశ్నించరు?
సైన్స్ పరిజ్ఞానం ముందు కరోనా తుచ్ఛమైనది. దీనికి లక్ష రెట్లు ప్రమాదకరమైన జబ్బుల్ని సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా సైన్స్ కి ఉందనేది అనేకసార్లు రుజువైంది. కరోనా సైన్స్ కి సవాలుగా నిలిచింది అని ఎవరైనా అంటే అది సైన్స్ ని అవమానించడమే. వాళ్లకు సైన్స్ గురించి ఏమీ తెలియదనుకోవాలి.
ఇప్పుడు కరోనా విషయంలో వీళ్ళు చెబుతోందే శాస్త్రీయమైనది అని ఒప్పుకోవాలంటే….. మైక్రో బయాలజీ రంగంలో ఇంతవరకూ జరిగిన పరిశోధనలు, సంపాదించుకున్న శాస్త్ర విజ్ఞానం, ఫలితంగా ఇంతకాలం మనం అనుభవించిన, అనేక రోగాలకు నుంచి పొందిన రక్షణ అన్నీ అబద్ధం అని ఒప్పుకోవాలి. కాదు ఇంతకాలం ఉన్న సైన్సే నిజమైతే దానికి విరుద్ధంగా ఉన్న కరోనా సైన్స్ అశాస్త్రీయమని ఒప్పుకోక తప్పదు.
*హాస్పిటల్ అశాస్త్రీయతను ఆమోదించడం ఎందుకు?
ఇక ఆనందయ్య ఇచ్చే మందు అశాస్త్రీయం, పని చేయదు అనే అనుకుందాం ( చెట్ల మందులు ఏవీ పని చేయవు అనుకోవడం మూర్ఖత్వం ). వెంటనే… హాస్పిటల్ అశాస్త్రీయతను ఆమోదించడం ఎందుకు? నాటు మందు అశాస్త్రీయత వ్యతిరేకించడం ఎందుకు? అనే ప్రశ్న వస్తుంది. అశాస్త్రీయమైనది ఏదైనా వ్యతిరేకించాల్సిందే.
నేను ఈ నాటు మందుని సమర్థిస్తున్నానని కొంత మంది, నా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నన్ను విమర్శిస్తున్నారు. అశాస్త్రీయత పెంచి పోషిద్దామా? ! అని.
సమర్థించడానికీ…. గత్యంతరం లేని పరిస్థితిలో తలవొగ్గడానికీ…. ఈ రెంటికీ చాలా తేడా ఉంది. నేను చేస్తుంది రెండోది. ఇది అశాస్ర్తీయతకు సమర్ధన ఎంత మాత్రం కాదు.
*తాము వణికిపోతూ.. రోగులను వణికిస్తూ..
‘మామూలు కరోనా పిల్లి’ ని ‘మహమ్మారి పులి ’ అని చూపించి గడగడలాడించారు. ఆ భయానికి తోడు కార్పొరేట్ హాస్పిటల్స్ మోసం కలిసి వేలమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంది. ఇల్లూ వాకిలీ, పొలమూ పుట్రా అన్నీ అమ్ముకుని సర్వం తెచ్చి వీళ్ళ మొహాన కొట్టినా… అంతా దండుకుంటూనే, ఇంకా కావాలని పీడిస్తూ … వీళ్ళే గజగజా వణికిపోతూ పీపీఇ కిట్లలో మునిగి ఏ మందులు ఇస్తున్నారో అవి ఎలా పనిచేస్తాయో వీళ్ళకే తెలియని స్థితిలో, ఒణుకుతూ రోగిని ఒణికిస్తూ డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ మీద రోగులకు నమ్మకం ఎలా వస్తుంది?
నమ్మకం లేని చోట ఏ మందూ పని చేయదు. ఆనందయ్య కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా, ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకుండా ధైర్యంగా అందరి మధ్యకీ వచ్చి ఇది అంత ప్రమాదకరమైంది ఏమీ కాదు అని చెప్పకనే చెబితే…. ఈ మందుతో కచ్చితంగా పోతుంది అనే నమ్మకం కలిగిస్తే, ఇదంతా తన స్వార్థంతో చేస్తున్నాడేమో అనే అనుమానానికి అవకాశమే లేకుండా ఫ్రీగా పంపిణీ చేస్తే ప్రజలు నమ్మకుండా ఎందుకుండాలి?
నమ్మకం ఉన్న చోట మంచి నీళ్లు కూడా మందులా పని చేసి జబ్బు నయం చేస్తాయి. ఈ మందుతో ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు, ఎవరికీ ఏ నష్టం కలగనప్పుడు… ఆనందయ్య మందు అనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు?
మన మొగ్గు ఎటు ఉండాలి?
*ఇదీ అశాస్త్రీయమే, అదీ అశాస్త్రీయమే.
* వీళ్ళు వందల అబద్ధాలతో, కోట్లు గుంజుతూ వేల మందిని పొట్టనపెట్టుకుంటున్నారు.
* అతను ఒక్క అబద్ధంతో (తన మందు నిజమని అతని నమ్మకం ) వేల మందికి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించి ప్రాణాలు నిలబెడ్తున్నాడు (భయం పోతేనే ప్రాణం నిలుస్తుంది ).
ఈ రెండు అబద్ధాలు తప్ప మరో ఆప్షన్ లేని పరిస్థితిలో మానవత్వం ఉన్న వాళ్ళు ఏ అబద్ధం వైపు మొగ్గు చూపాలి?? !!!
*నిలదీయాల్సింది ఎవరిని?
ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేయలేని దగుల్బాజీ ప్రభుత్వాలు ఉన్న దేశంలో ప్రజలు అజ్ఞానంలో ఉంటే ఆ తప్పు వాళ్ళది కాదు. నిలదీయాల్సింది వాళ్ళను అజ్ఞానంలోకి నెట్టే వాళ్ళను.
ఇప్పుడంటే ఈ కరోనా చిన్న జబ్బు కాబట్టి జనాలు ఇలా నాటు మందు వైపు పరుగులు తీసినా నష్టం లేదు. కానీ రేపు నిజంగా ప్రమాదకరమైన జబ్బు వస్తే అప్పుడు కూడా జనం నాటు మందునే ఎంచుకుంటే సంభవించే ఘోరాలకు సైన్స్ ని ఖూనీ చేసే స్వార్థపరులే బాధ్యులు అవుతారు.
*సైన్స్ తెలిస్తేనే చాలదు…
ఇలాంటి దౌర్భాగ్యపు స్థితికి కారణం తెలియాలంటే, మనిషికి సైన్స్ తెలిసినంత మాత్రాన సరిపోదు, సమాజం అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మార్క్సిజం కచ్చితంగా తెలిసుండాలి. మార్క్సిజం తెలిసిన వాళ్ళు కులం, మతం, ప్రాంతం, దేశం, సైన్స్ అన్నిటికంటే కూడా మనిషి ప్రాణానికే ఎక్కువ విలువిస్తారు.
సైన్స్ ఉన్నది మనిషి కోసం కానీ మనిషి ఉన్నది సైన్స్ కోసం కాదు!
-వనజ చే
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Is there any science in corporate treatment
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com