Homeజాతీయ వార్తలుఅంత బలవంతుడివా? కబ్జాకోరుడికి హైకోర్టు షాక్

అంత బలవంతుడివా? కబ్జాకోరుడికి హైకోర్టు షాక్

High Courtఅధికార పార్టీ అండ చూసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టడం మామూలే. ఇటీవల ఈ దందా ఎక్కువైపోయింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కబ్జా చేస్తూ తమ పలుకుబడితో దర్జాగా తిరుగుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఆ అప్పీలును విచారిస్తున్న క్రమంలో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని వివరాలపై మండిపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీలో 1200 చదరపు గజాల స్థలంలో గోపాల్ రావు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టారు. అది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ పంచాయతీ ఏప్రిల్ 21న కూల్చివేతకు నోటీసులు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గోపాల్ రావు పిటిషన్ ను విచారించిన సింగిల్ జడ్జి దాన్నికొట్టివేశారు. అనుమతులు తిరస్కరిస్తూ పంచాయతీ చేసిన తీర్మానాన్ని సవాలు చేయకపోవడంతోపాటు హైకోర్టులో ఉన్న మరో పిటిషన్ వివరాలను తొక్కిపెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు.

ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీల నుంచి నివేదికలను తెప్పించారు. గోపాల్ రావుపై చర్య తీసుకోవడానికి జిల్లా పంచాయతీ అధికారి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి తదితరులను బదిలీ చేయించారు. అక్రమ నిర్మాణంపై ఓ వ్యక్తి పిటిషన్ వేయగా ఆయన న్యాయవాదిని బెదిరించారు. ఉపసంహరించుకోవడానికి నిరాకరించడంతో భౌతిక దాడులకు పాల్పడ్డారు. బలవంతంగా ఎన్వోసీపై సంతకం తీసుకున్నారు. మరో న్యాయవాది వస్తే ఆయన్ను బెదిరించారు అని పేర్కొంటూ గోపాల్ రావు పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేశారు.

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై గోపాల్ రావు దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం గోపాల్ రావు వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత బలవంతుడైతే ఈ వ్యవహారాన్ని తామే పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొంది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని గోపాల్ రావును ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular