TDP Alliance : వైసీపీ అవలంబిస్తున్న ఒంటెద్దు విధానాల వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమే వాటి ముందున్న ప్రధాన కర్తవ్యం. ప్రధాన ప్రతిక్షం టీడీపీ అందిరినీ కలుపుకుపోవాలని చూస్తుంది. ఎన్నికల నాటికి ఒక అవగాహనకు వస్తే సీట్ల సర్దుబాటు సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందరినీ కలుపుకొని చంద్రబాబు ముందుకు ఎలా తీసుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.
జీవో నెం 1 పై పోరాటానికి ఏకమై..
వైసీపీ ప్రభుత్వం ఇటీవల జీవో నెం 1 తీసుకువచ్చింది. దీని ప్రకారం బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై పోలీసుల అనుమతి తప్పనిసరి. చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటను కారణంగా చూపుతూ జగన్ దీనిని అమల్లోకి తీసుకువచ్చారు. ప్రతిపక్షాలను తొక్కిపెట్టడమే ఈ జీవో ముఖ్య ఉద్దేశ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభలకు విపరీతంగా ప్రజలు వస్తున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. జీవో నెం 1ను సాకుగా చూపుతూ ఆ ర్యాలీలను అడుగడుగునా అడ్డంకులను ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇందుకు పోలీసులను వాడుకుంటుంది. దీనిపై వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం కూడా విమర్శించాయి. ఇదే విషయమై అసెంబ్లీలో పెద్ద గొడవే జరిగింది.
ఊపునిచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ఎమ్మెల్సీ ఎన్నికలు వామపక్ష పార్టీలను టీడీపీకి మరింత చేరువచేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు చేజారినా, గెలుపునకు సమష్టిగా పనిచేశాయి. ఫలితంగా కొద్ది మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థులు బయటపడ్డారు. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు టీడీపీకి వేసి, రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో కలుపుకోవాలని ఆయన భావిస్తున్నట్లున్నారు. అలాగే, జనసేన కూడా టీడీపీతో బంధం ఏర్పాటు చేసుకుంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
మరీ సీట్ల సర్దుబాటు ఎలా?
అనుకుంటున్న విధంగా సీపీఐ, సీపీఎం, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తే సీట్ల సర్దుబాటు ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఆవిర్భస్తున్న జనసేన ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. సుమారు 50 నుంచి 60 వరకు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే, సీపీఐ, సీపీఎం చెరో 5 స్థానాలు అడిగినా, మొత్తం సుమారు 60 నుంచి 70 వరకు మిత్రపక్షాలకు వెళ్లిపోతాయి. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో ఖచ్చితంగా గెలిచే స్థానాలను కావాలని ఆయా పార్టీలు పట్టుబడితే టీడీపీ ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ జనసేన అన్ని స్థానాల్లో పోటీచేస్తే భారీగా ఓటు చీలడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో జనసేనతో కలిసి వెళ్లేందుకు టీడీపీ సుముఖత చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు చేజారకుండా చూడగలగితే విజయం వరిస్తుంది. అలాకాని పక్షంలో అనుకుంటున్నది కష్టతరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.