Husband-Wife : మానవత్వం మంటగలుస్తోంది.సభ్యసమాజం తలదించుకునే పనులు కొందరు చేస్తున్నారు. మిన్ను మన్ను కానకుండా వ్యవహరిస్తున్నారు. రాజధాని నగర నడిబొడ్డున కొందరు వ్యవహరిస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. కోపతాపాలకు సంసారాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. హత్యలకు దారితీస్తోంది.
హైదరాబాద్ లో తాజాగా దారుణం జరిగింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశం నగర్ లో అందరూ చూస్తుండగానే రోడ్డుపైన భార్యను చంపిన భర్త కిరాతకంగా వ్యవహరించాడు. వీరి సంసారం వివాదాలతోనే సాగేది.
లంగర్ హౌస్ లో మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.
ఈరోజు ఉదయం కాపు కాసి కరీమా బేగం స్కూల్ కి వెళ్తున్న సమయంలో ఐరన్ రాడ్డుతో ఆమెపై రోడ్డుపై దాడి చేసి హతమార్చాడు. స్థానికులు పట్టుకొని నిందితుల్ని పోలీసులకు అప్పగించారు.
సదరు మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ ను సేకరిస్తున్నారు.
పట్టపగలు మిట్టమధ్యాహ్నం జరిగిన హత్య కలకలం రేపింది. స్థానికులను భయపెట్టింది.