Good News: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలకు అర్హత వయసును మరో రెండేళ్లు పెంచాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది. ఈ మేరకు ఎన్నికల హామీల అమలుకు కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. కొత్త కమిటీని నియమించింది. అదే విధంగా టీఎస్పీఎస్సీపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ను కూడా ఉపసంహరించుకోవాలని తాజాగా నిర్ణయించింది. దీంతో ఉద్యోగ నోటిషికేషన్ల జారీకి అడ్డంకులు తొలగినట్లుయింది. మరోవైపు గ్రూప్–1 నోటిఫికేషన్ త్వరలో జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. పాత నోటిఫికేషన్కు మరో 60 పోస్టులు కలిపే అవకాశం ఉంది.
వయో పరిమితి పెంపు..
ఎన్నికల మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిషికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది. ఫిబ్రవరి 1 దాటి 11 రోజులు గడిచింది. నోటిఫికేషన్ మాత్రం రాలేదు. మెగా డీఎస్సీ ఇస్తామని కూడా ప్రకటించింది. ఇప్పటికీ దాని ఊసేలేదు. ఈ క్రమంలో నిరుద్యోగుల వయోపరిమితి మరో రెండేళ్లు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఇలా..
తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్(టీఆర్ఎస్) ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ దానిని 46 ఏళ్లకు పెంచింది. రిజర్వుడు కేటరిటీలకు మరో ఐదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే ఈ సడలింపు యూనిఫాం సర్వీసులకు మాత్రం వర్తించదు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు.
నోటిఫికేషన్లు ఆలస్యమేనా..
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల వయోపరిమితి పెంపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా, నోటిషికేషన్లు జాప్యం అవుతాయా అన్న అనుమానం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కొందరు మాత్రం అర్హులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు.