Homeజాతీయ వార్తలుBRS: భద్రత వారికే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇక ఫుల్ సెక్యూరిటీ

BRS: భద్రత వారికే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇక ఫుల్ సెక్యూరిటీ

BRS: మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై రెండు రోజుల క్రితం కత్తిదాడి జరిగింది. సెల్ఫీ అంటూ ప్రభాకర్‌రెడ్డి వద్దకు వచ్చిన ఓ యువకుడు కత్తితో ఎంపీ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కాగా, కత్తి దాడి నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అనిల్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత విషయంలో అందరికీ ఒకే నియమం పాటించాల్సి ఉన్నా.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెంచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

2+2 నుంచి 4 +4గా..
తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2+2 భద్రత ఉంది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి నేపథ్యంలో తాజాగా దానిని 4+4గా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రతను తక్షణమే పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.

విపక్షాల ఆగ్రహం..
బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రత పెంపుపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరినీ ఒకేలా చూడాల్సిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తమ పార్టీ వారిని ఒకలా, విపక్షాల ప్రజాప్రతినిధులను ఒకలా చూస్తోందని ఆరోపిస్తున్నారు. భద్రత విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కోలుకుంటున్న ప్రభాకర్‌రెడ్డి..
కాగా, దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై రాజు కత్తితో దాడి చేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, కార్యకర్తలు ప్రభాకర్‌ రెడ్డిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో అదేరోజు ఆయనకు ఆపరేషన్‌ చేశారు. మరో మూడు రోజులు ప్రభాకర్‌రెడ్డి ఐసీయూలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular