నియంత్రిత పంటల సాగుతో దేశంలో వ్యవసాయానికి నవశకం రానుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. మద్దతు ధరల లేని పంటలను వేయొద్దని సీఎం చెబుతున్నారు. మద్దతు ధర వచ్చే సాగు చేస్తే రైతులు బాగుపడతారన్నదే సీఎం ఆకాంక్ష. రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ. ప్రగతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో తెలంగాణ ఆదాయం 95 శాతం తగ్గింది. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ. 1,200 కోట్ల రుణమాఫీ చేశామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక కష్టాలు పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసు అని కేటీఆర్ అన్నారు. ఇవాళ రైతులకు పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు కరెంట్ కు కొదవ లేదు. సీఎం కేసీఆర్ కృషితో ఎండకాలంలోనూ చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. రైతులు నిర్భయంగా సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సీఎం ఆర్థిక చేయూత అందించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. వానాకాలం సాగు కోసం నిధులు అందజేశాం. ఎరువులు, విత్తనాలు ముందస్తుగా తీసుకొచ్చి రైతులు వరుసల్లో నిలబడకుండా చేశామన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా నీరు అందిస్తాం. దసరా వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. పిల్ల కాల్వల ఏర్పాటుకు గ్రామాల్లో పదెకరాలు భూమి పోతుంది. ఒక్కో గ్రామంలో పది మంది రైతులు భూమి కోల్పోతే వందమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.