తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తెర వెనుక ఏం జరిగిందనే విషయంలో ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నప్పటికీ.. ఈటల రాజేందర్ మాత్రం ఎవరిపైనా విమర్శలు, ఆరోపణలు చేయలేదు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. నిజానిజాలను వెలికితీయాలని మాత్రమే అన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అయితే.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన ఆయన లోతుగా మాట్లాడినట్టు సమాచారం. తనపై కబ్జా ఆరోపణలు పథకం ప్రకారమే చేస్తున్నారని, ఎవరు ఎలా వ్యవహరించాలో ముందస్తుగా ప్లాన్ వేసుకున్నారని, దాని ప్రకారమే ఈ తతంగం మొత్తం నడుస్తోందని ఈటల అన్నట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేరని, రెండోసారి గెలిచిన తర్వాత ఉద్యమ కారులను, బంధాలను పక్కన పెట్టారని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తాను తప్పు చేస్తే పిలిచి మందలించాల్సి ఉందన్న ఆయన.. ఇలాంటి ఆరోపణలు చేయడం తన వ్యక్తిత్వాన్ని చంపడమే అని భావోద్వేగానికి గురైనట్టు సమాచారం.
భూముల విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, సిట్టింగ్ జడ్జితో, లేదా అన్ని దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని, తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారట. తాను స్థాపించాలనుకున్న పరిశ్రమ కోసం టీఎస్ఐఐసీని ఆశ్రయించామని, తొండలు గుడ్లు కూడా పెట్టని భూములను గుర్తించామని చెప్పారట. వాటినే తమకు కేటాయిస్తామని చెప్పారని, అది కూడా ఇంకా ప్రాసెస్ లోనే ఉందని, అంతే తప్ప.. తాను కబ్జా చేశానని అనడం సమంజసం కాదని చెప్పారట.
తనపై కొన్ని పత్రికల్లో కథనాలు రాయించారని, ఎక్కడా తనను మంత్రిగా కాదు, సహచరుడిగా కాదు, మనిషిగా కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారట. సీఎంను గత అసెంబ్లీ సమావేశాల్లోనే కలిశానని, ఆ తర్వాత ఒక్కనాడు కూడా కలవలేదని చెప్పారట. నిజంగా తాను తప్పు చేసి ఉంటే.. పిలిచి అడగొచ్చుకదా.. అని అన్నారట. ఇవేవీ చేయకుండా టీవీల్లో వేసి బద్నాం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారట.