దేశంలో మొదటి 10వేల కరోనా కేసులు నమోదుకావడానికి పట్టిన సమయం దాదాపు 3నెలలు కానీ మరో 10వేల కేసులకు పట్టిన సమయం 10రోజులకంటే తక్కువే. కేరళ లో జనవరి 18న మొదటి కరోనా కేసు నమోదయింది. అప్పటినుండి 10వేల మార్క్ చేరుకోవడానికి (ఏప్రిల్ 13నాటికి) 85 రోజుల సమయం పట్టింది. 20వేల మార్కు చేరుకోవడానికి కేవలం 10రోజులు సమయం పట్టడం గమనార్హం.
దీనిని బట్టి దేశంలో కరోనా మరింత విజృంభిస్తోందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1400 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20వేలకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 19,984 కరోనా కేసులు నమోదయ్యాయి. 3870 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 640 మంది మృతి చెందారు.
ఇక, మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆ రాష్ట్రంలో 5218 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 2178, ఢిల్లీలో 2156, రాజస్థాన్లో 1659, తమిళనాడులో 1596, మధ్యప్రదేశ్లో 1552, ఉత్తరప్రదేశ్ లో 1294, తెలంగాణలో 928, ఏపీలో 757, కేరళలో 427, పశ్చిమ బెంగాల్ లో 423, కర్ణాకటలో 418, జమ్మూకశ్మీర్ లో 380, హరియాణాలో 254, పంజాబ్ లో 245, బిహార్ లో 126, ఒడిసాలో 79, ఉత్తరాఖండ్ లో 46, జార్ఖండ్ లో 45, హిమాచల్ప్రదేశ్ లో 39, ఛత్తీస్గఢ్ లో 36, అసోం లో 35, ఛండీగఢ్ లో 27, లడఖ్ లో 18, మేఘాలయాలో 12, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్లో 2, త్రిపురలో 2, అరుణాచల్ప్రదేశ్లో 1, మిజోరంలో ఒక కరోనా కేసు నమోదైంది.