గుంటూరు జిల్లాలో రోజూ కరోనా కొత్త కేసులు వస్తున్న వేళ, కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై గుంటూరులో రోజు విడిచి రోజు సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుందని, ఒక్క షాపు కూడా తీసేది లేదని తెలిపారు. రెడ్ జోన్ల పరిధిలో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లేందుకు అంగీకరించబోమని, ప్రస్తుతం అనుమతిస్తున్న ఉదయం 6 నుంచి 9 వరకూ నిత్యావసరాల కొనుగోలు, ఇకపై రోజు విడిచి రోజు మాత్రమే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. జిల్లాలో ఎప్పటి వరకూ 58 కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులున్న జిల్లాల వరుసలో రెండవ స్థానంలో నిలిచింది.
ప్రతి ఆదివారం లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతుందని, మెడికల్ షాపులు, ఆసుపత్రులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని వెల్లడించారు. ప్రజలు తమ అవసరాలకు తగినట్టుగా 15 రోజులకు సరిపడా, మందులు, చిన్నారులకు పాల డబ్బాలు, నిత్యవసరాలు కొనుగోలు చేయాలని సూచించిన కలెక్టర్, కూరగాయలు రోజు మార్చి రోజు ఉదయం పూట కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ వ్యాప్తిని అరికట్టాలన్నదే తమ ఉద్దేశమని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.