తమిళనాట గెలుపు డీఎంకేదే అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రీ-పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా స్టాలినే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పాయి. ఇంచుమించు ఆ రాష్ట్ర జనాలు కూడా ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో.. ఆ ఒక్క సీటుపైనే రాష్ట్రం దృష్టి నెలకొంది. అదే.. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం.
ఇక్కడ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ బరిలో నిలవడమే కారణం. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి వనాతి శ్రీనివాసన్, కాంగ్రెస్ తరపున మయూరా జయకుమార్ పోటీలో ఉన్నారు. 2008లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే.. రెండు సార్లూ అన్నా డీఎంకే అభ్యర్థులే విజయం సాధించారు.
ఇప్పుడు అన్నాడీఎంకే-బీజేపీ కూటమిగా బరిలోకి నిలవడంతో.. ఈ సీటు బీజేపీ అభ్యర్థికి కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మయూరా జయకుమార్ గత ఎన్నికల్లోనూ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో.. ఆయనకు సానుభూతి వర్కవుట్ అవుతుందన్న ఆశలో ఉంది కాంగ్రెస్. ఇటు బీజేపీ.. అన్నాడీఎంకే బలమైన ఓటుబ్యాంకు తమకు కలిసి వస్తుందని ఆశిస్తోంది.
అయితే.. కమల్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. తమిళనాట రజనీకి ఎంత ఫాలోయింగ్ ఉందో.. కమల్ కు సైతం అంతే పాపులారిటీ ఉంది. పైగా పార్టీ పెట్టిన తర్వాత ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పోటీచేసినప్పటికీ.. కమల్ బరిలో నిలవలేదు. దీంతో.. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే మొదటి సారి అయ్యింది. ఈ నేపథ్యంలో లోకనాయకుడు గెలుస్తాడా? లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.