
లాక్డౌన్ కారణంగా ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబును కోరారు. ఆ మేరకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఇప్పటికే 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందని, దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లో విక్రయించే అవకాశం రైతులకు ఉందని, కానీ పొగాకు రైతులకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. మార్చి తొలి వారంలోనే జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడిందని, ఇది మరింత ఆలస్యమైతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. బోర్డు వెంటనే స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లా పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో రైతులు పోగాకును సాగు చేసున్నారు. రైతుల వద్ద నుంచి పోగాకును పొగాకు ఉత్పత్తులు తయారు చేసే సంస్థలు, మరికొన్ని ఏజెన్సీలు మాత్రమే కొనుగులు చేస్తాయి. లాక్ డౌన్ కారణంగా పొగాకు ఉత్పత్తులు తయారీ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ సంస్థలు కొనుగోళ్ళకు ముందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పొగాకు రైతుల సంఘము చెబుతోంది.