కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక దేశవ్యాప్తంగా ‘టోల్ ప్లాజా’లు ఉండవని ప్రకటన చేసింది. ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్రరవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో తెలిపారు. దీని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని లోక్ సభలో ప్రకటించారు.
ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ బూత్ లను తొలగిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపడుతామన్నారు.
వాహనానికి ఉన్న జీపీఎల్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. అయితే మిగతా 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్ కడుతున్నా ఫాస్టాగ్ ఉపయోగించడం లేదని చెప్పారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.
ఇప్పుడొస్తున్న కొత్త వాహనాల్లో అన్నింటిలో ట్రాకింగ్ వ్యవస్థ ఉంది. టోల్ వసూలుకు కూడా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీపీఎస్ ఆధారంగా టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా వాహన కదలికలను బట్టి వినియోగదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తం కట్ అవుతుంది. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీలు వసూలు అవుతాయి.