AP capital: ఏపీ రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయితే అది పార్లమెంట్లో సభ్యుల వరకే చెప్పడమే తన పని అన్నట్లు చూస్తోంది. జగన్ సర్కార్ కు మాత్రం ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. అమరావతి రాజధానిపై ఎవరూ క్వశ్చన్ చేయడం లేదు. దీంతో మూడు రాజధానులతో ముందుకెళ్లాలని జగన్ ప్రయత్నిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీ రాజధాని అమరావతి అని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట విశాఖలో అడుగు పెట్టాలని జగన్ ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం ఏపీ రాజధాని అమరావతిని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలో భాగంగా.. సవివరంగా ఈ విషయాన్ని తేల్చేసింది. వాస్తవానికి ఏపీ రాజధాని అమరావతి. అందులో ఎటువంటి సంకోచాలు లేవు. కానీ తాము మూడు రాజధానులు పెడతామని.. విశాఖపట్నం రాజధాని అని.. చివరకు అదొక్కటే రాజధాని అని వైసిపి ప్రచారం చేస్తోంది. కానీ చట్టపరంగా అది అంత సులువు కాదు. దీంతో రకరకాల కారణాలు చెబుతూ విశాఖ నుంచి పాలనకు జగన్ సిద్ధపడుతున్నారు.
విశాఖ రాజధాని అంటూ హడావిడి చేస్తున్న జగన్.. అందరి కళ్ళుగప్పి, న్యాయస్థానాలకు తప్పుడు లెక్కలు చెప్పి రిషికొండపై 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ లను నిర్మించారు. కానీ ధైర్యంగా అందులోకి వెళ్ళలేకపోతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కొంత సంశయంగా ఉండేది. రాజధాని విషయంలో నేరుగా ప్రకటన చేయడానికి ఇబ్బంది పడేది. ఇప్పుడు మాత్రం అమరావతి రాజధాని అని ఎప్పటికప్పుడు తేల్చేస్తుంది. నేరుగా సమాధానం ఇస్తోంది.
రాజధానిగా అమరావతిని మార్చడం న్యాయపరంగా సాధ్యం కాదని అందరికీ తెలుసొస్తోంది. అందుకే ఈ విషయంలో తనపై అపవాదు పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. అది ఏపీ ప్రభుత్వ ఇష్టమని తొలుత చెప్పిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం అమరావతి ఏపీ రాజధానిని స్పష్టం చేస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ మాత్రం మొండిపట్టు వీడడం లేదు. ఎన్నికలకు ముందు విశాఖకు వెళ్లి ఏదో చేస్తున్నానని ప్రజలు అనుకోవాలని ఆయన భావిస్తున్నారు. కానీ విశాఖ రాజధాని అనేటప్పుడే అక్కడి ప్రజలు స్వాగతించలేదు.. అలాగని వ్యతిరేకించలేదు. కానీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల రాకను మాత్రం అనుమానిస్తున్నారు. వారు రాకపోతే బాగున్ను అన్న అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది.