
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి చిన్నాన అయిన వివేకా హత్య కేసును ఎవరూ తేల్చడం లేదు. ఏపీ పోలీసులు దీన్ని ఇప్పటి వరకు ఓ కొలిక్కి తీసుకురాలేదు. సిట్ మీద సిట్ లు వేసినా కేసులో మార్పు రాలేదు. చివరిక హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయినా అదే పరిస్థితి. రెండు విడతలుగా సీబీఐ అధికారులు వచ్చిపోయారు కానీ.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదే సమయంలో కడపలో అలాంటి హత్యలు సాధారణమేనని.. సీబీఐ అధికారులు తనతో అన్నారంటూ.. వైఎస్ వివేకానంద కుమార్తె ఢిల్లీలో ప్రకటించడంతో సీబీఐ అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో వైసీపీ అధినేత.. సీఎం జగన్.. వివేకానంద హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులతో వీడియోకాల్ లో మాట్లాడారంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో వైఎస్ వివేకానంద హత్య కేసులు విషయం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఈ అంశం అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.
వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తేల్చాలని డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. సీబీఐపై అనుమానాలు ప్రారంభం అవుతున్నాయని… రాజకీయ పరంగా ఓ హత్య కేసును సైతం దారి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడం సీబీఐ విశ్వసనీయతమే తీవ్రంగా దెబ్బకొట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మళ్లీ పెద్దగా హడావుడి లేకుండా నలుగురు సభ్యుల బృందం పులివెందుల చేరుకుంది. వారం చేస్తారో.. ఇప్పటి వరకు ఏం దర్యాప్తు చేశారో.. ఎవరికీ స్పష్టత లేదు.
కానీ ఏదో ఒకటి చేస్తున్నామని చెప్పడానికి మాత్రం వచ్చినట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కేసులో అయినా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన వారే ప్రధాన అనుమానితులు.. భవిష్యత్ నిందితులుగా ఉంటారు. వివేకానంద కేసులో హత్యను సహజమరణంగా నమ్మించి మృతదేహానికి కట్లు కట్టి.. రక్తం తుడిచేసిన వారు ఎవరో అందరికీ తెలుసు. కానీ ఇంత వరకు వారిని మాత్రం ప్రశ్నించుకుండా.. కేసు విచారణ చేస్తున్నారంటే… సీబీఐ ఎంత సీరియస్ గా కేసును దర్యాప్తు చేస్తుందో.. అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు ఇతర పార్టీల నాయకలు గుప్పిస్తున్నారు.