Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు కొందరు. మరికొందరు అయితే రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఆయన కుమారుడు పార్టీలో చేరారు. అయితే అందులో కొంతమంది మాత్రమే జగన్మోహన్ రెడ్డితో ఇమడగలిగారు. అటువంటి నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన తొలితరం నేతల్లో ఆయన ఒకరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ తరువాత పెద్దిరెడ్డి అన్నట్టు హవాసాగింది. అయితే అందరూ నేతల మాదిరిగా ఎక్కువగా మాట్లాడరు పెద్దిరెడ్డి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా ప్రభావం చూపగలరు. కానీ ప్రస్తుతం పెద్దిరెడ్డి కుటుంబం తీవ్ర అసంతృప్తితో ఉందని.. పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడంతోనే ఆ ఫ్యామిలీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది..
* సుదీర్ఘ నేపథ్యం..
చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు చంద్రబాబుతో సుదీర్ఘకాలం రాజకీయ వైరం ఉంది. అదే మాదిరిగా నల్లారి కుటుంబంతో సహితం తీవ్ర విభేదాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయంగా ప్రోత్సాహం అందించేవారు. అందుకే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక.. కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వెళ్లిపోయారు పెద్దిరెడ్డి. తన పదవిని సైతం వదులుకొని జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. ఒక్క చిత్తూరుకు మాత్రమే పరిమితం కాలేదు. రాయలసీమలో పార్టీ బాధ్యతలను కూడా తీసుకున్నారు. అటు జగన్ పెద్దిరెడ్డిని నమ్మారు. పెద్దిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డి పై అదే నమ్మకంతో వ్యవహరించారు. కానీ ఇప్పుడు జగన్ వైఖరి మారింది. అటు పెద్దిరెడ్డి మనసు సైతం మారుతోందని తెలుస్తోంది.
* అంతటి ప్రభంజనంలో..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం పట్టు నిలుపుకుంది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గెలుపొందారు. అయితే జగన్ వైఖరి మారడానికి కారణం పెద్దిరెడ్డి ఫ్యామిలీ విజయం. పెద్దిరెడ్డి వైఖరి కారణంగానే చిత్తూరు జిల్లాలో మిగతా నియోజకవర్గాలు పోయాయని జగన్ భావించారట. అదే సమయంలో పెద్దిరెడ్డి సైతం జగన్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. పైగా మద్యం కుంభకోణంతో పాటు అటవీశాఖ భూములకు సంబంధించి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది.
* కేసుల బారిన పడి..
మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రోజుల తరబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నుంచి తాము కూటమికి వ్యతిరేకమయ్యామని.. అనవసరంగా వైరం తెచ్చుకున్నామని పెద్దిరెడ్డి భావిస్తున్నారట. ఆపై పార్టీలో కొంతమంది నేతల ను నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం పెద్దిరెడ్డికి నచ్చడం లేదట. అందుకే ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే ఇది ఇలానే ముదిరితే మాత్రం పెద్దిరెడ్డి ఫ్యామిలీ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.








