Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి మద్దతు తెలపడంలో భిన్న వైఖరి కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రులుగా ఉన్న తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకరికి మద్దతు తెలిపి.. మరొకరి విషయంలో పార్టీ సైలెంట్ కావడం.. పార్టీ శ్రేణుల్లోనే భిన్న వాదన వినిపిస్తోంది. ఇది సరికాదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. కుమారుడు బైక్ ప్రమాదంతో ఒకరి మరణానికి కారణం కావడంతో కార్నర్ అయ్యారు అప్పలరాజు. నకిలీ పత్రాలతో తన కుమారుడు పేరుతో భూమిని రాయించుకున్న కేసులో నిందితుడిగా మారారు తమ్మినేని సీతారాం. అయితే ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు చిక్కుల్లో పడ్డాయి.
* బైక్ ప్రమాదంతో..
కొద్ది రోజుల కిందట కాశీబుగ్గ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మృతి చెందారు. మాజీమంత్రి అప్పలరాజు కుమారుడు బైక్ తో ఢీ కొట్టి ఈ ప్రమాదానికి కారణమయ్యారు. అయితే రోడ్డు ప్రమాదాలు అనేవి సహజం అయినప్పటికీ.. మాజీ మంత్రి కుమారుడి స్థానంలో వేరే యువకుడిని పంపించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అప్పలరాజు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు అప్పలరాజు పై కూడా కేసు నమోదై అరెస్టు చేసే వరకు వచ్చింది పరిస్థితి. కానీ అప్పలరాజుకు అండగా నిలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తో పాటు జిల్లా నేతలంతా సంఘీభావం తెలిపారు.
* భూ కబ్జా కేసులో..
మరోవైపు తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు వివాదం కేసులో. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి నాలుగు కోట్ల రూపాయల భూమిని తన కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట రాయించుకున్నారు. ఈ వ్యవహారంలో ఆయన భార్య వాణి ప్రమేయం కూడా ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో కుటుంబమంతా పరారీ అయింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ద్వారా ఉపశమనం పొందాలన్న ప్రయత్నం కూడా జరగలేదు. ఎలాగైనా అరెస్టు తప్పదని తెలిసిపోయింది. అయితే తమ్మినేని కి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మద్దతు తెలపలేదు. కనీసం మాట సాయం చేసేందుకు కూడా శ్రీకాకుళం జిల్లా నేతలు ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో ఈ పార్టీ సీనియర్ ఇప్పుడు బాధపడుతున్నట్లు సమాచారం.
* పార్టీ నేతల సంఘీభావం..
మాజీ మంత్రి అప్పలరాజు కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు. తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లాడు తప్పు చేస్తే రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఇంటికి జిల్లా పార్టీ నేతలను పంపించి సంఘీభావం తెలిపారు. కానీ అదే పార్టీలో రాజ్యాంగబద్ధ పదవి చేపట్టిన తమ్మినేని సీతారాం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఆ పార్టీ నేతలు మద్దతుగా నిలవలేదు. దీంతో తమ్మినేని సీతారాం నోచుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత వైఖరిని తప్పు పడుతున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.







