వైఎస్సార్ మరణానంతరం జగన్ మీద కేసులు నమోదయ్యాయి. ఆయన కంపెనీల్లో హవాళ పెట్టుబడులు అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీబీఐ ఎంక్వైరీ చేశారు. చివరకు జగన్ను అరెస్టు చేసి సంవత్సరానికి పైగా జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఆ కేసులు సీబీఐ కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆ కేసులు శుక్రవారం విచారణకు వస్తున్నాయి. ఈ కేసుల్లో తీర్పు ఎలా ఉండబోతోంది..? జగన్ భవిష్యత్ ఏంటి..? అనేది ఇప్పుడు అంతా ఆసక్తిగా మారింది.
Also Read: టీడీపీ బలమే.. ఇప్పుడు బలహీనత అవుతోందా?
హెటిరో, అరబిందోలకు భూ కేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా ఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్కు లీజులు, ఇందూ గ్రూపు, వాన్పిక్కు భూకేటాయింపులు తదితరాలపై సీబీఐ 11 కేసులను విచారిస్తోంది. ఇందులో ఏ1గా జగన్మోహన్రెడ్డిని చేర్చారు. వీటితోపాటు ఎమ్మార్ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓబుళాపురం గనుల లీజు వ్యవహారాలపైనా నమోదైన కేసులతోపాటు జగన్ కేసుల్లో పెట్టుబడుల నిధుల బదలాయింపుల్లో అవకతవకలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ 5 కేసులు నమోదు చేసింది. ఎమ్మార్ వ్యవహారంపైనా కేసులు నమోదు కావడంతో ఈ కేసులు శుక్రవారం విచారణకు వస్తున్నాయి.
ఈడీ నమోదు చేసిన కేసులన్నీ ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టులో ఉన్నాయని, హెటిరో భూకేటాయింపు కేసును కూడా దానికి బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది జి.అశోక్రెడ్డి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, ఈడీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు.
జగన్ నమోదైన అక్రమాస్తుల కేసు వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్జర్లలో భూకేటాయింపులు చేయడంతో ప్రతిఫలంగా జగతి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 13న ఉండగా ప్రజాప్రతినిధులపై రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో జగన్, విజయసాయి రెడ్డిలు తదితరులపై ఉన్న విచారణ తేదీని మార్చారు.
Also Read: డేంజర్: కరోనాలో కొత్త కోణం.. విభిన్న మార్గాల్లో వ్యాప్తి
గురువారం కోర్టు ఇచ్చిన సమాచారం మేరకు న్యాయవాదులతోపాటు నిందితుల జాబితాలో ఉన్న కంపెనీల తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. కోర్టు గదిలోకి కేవలం లాయర్లను మాత్రమే అనుమతించారు. హాజరైన నిందితులు కోర్టు గది బయట వేచి ఉండిపోయారు. అయితే.. ఈ కేసును బదిలీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశామని, ఈనెల 20న విచారణకు రానుందని జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు బదిలీకి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది కూడా కోర్టుకు నివేదించారు. కేసులు ఫైనల్కు వస్తే జగన్ రాజకీయ భవిష్యత్తుపై ఆయన అభిమానుల్లోనూ, ఆయన పార్టీ నేతల్లోనే భయం కనిపిస్తోంది.