ఢిల్లీలో అల్లర్లను రేకెకెత్తించడంలో కీలక భూమిక వచ్చిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకుల `గోలిమారో’ నినాదాలు కలకత్తాలో స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభలో చెలరేగడం కలకలం రేపుతోంది. అమిత్ షా ఆదివారం కోల్కత్తాలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో గోలీమారో నినాదాలు చోటుచేసుకున్నాయి.
బిజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అయితే అమిత్షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పరిసర ప్రాంతాల్లోకి రాగానే బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారు సమీపంలోకి రాగానే ‘గోలీమారో… గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఎవరు ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా గోలీమారో నినాదాలు చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హింసను ప్రేరేపించే విధంగా బీజేపీ నేతలు… కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు గోలీమారో నినాదాలు చేసినా సరే, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నాయి. గోలీమారో నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్ సీపీఎం శాఖ డిమాండ్ చేసింది.