
సంపద సృష్టించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులు విక్రయిస్తున్నారని అన్నారు. ప్రజా ఆస్తులు అమ్మడం అంటే పాలన వైఫల్యమే అని స్పష్టం చేశారు. గుంటూరు నగరానికి ల్యాండ్ మార్క్ లాంటి పి.వి.కె.నాయుడు మార్కెట్ ను వేలానికి పెట్టి అమ్మేయాలనుకోవడం సరికాదు అన్నారు. గుంటూరు జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడారు. గుంటూరు నగరంలోని పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అమ్మాలనే ప్రభుత్వం నిర్ణయాన్నీ, పెరిగిన విద్యుత్ బిల్లుల తీరును వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా గుంటూరు నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, పార్టీ లీగల్ విభాగం నాయకులు గాదె వెంకటేశ్వర రావు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు పాకనాటి రమాదేవి తదితరులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరికి పవన్ అభినందనలు తెలిపారు.
సంపద సృష్టించి, ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అలా కాకుండా ఉన్న ఆస్తులు అమ్మేసి, వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినవారిని రోడ్డున పడేయడం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరు నగరంలో పి.వి.కె.నాయుడు మార్కెట్ ఒక ల్యాండ్ మార్క్ అన్నారు. ఈ మార్కెట్ తో నగర ప్రజలకు ఒక అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉందని, ఆ మార్కెట్ మీద ఆధారపడి 5 వేల మంది చిరువ్యాపారులు బతుకుతున్నారని తెలిపారు. పేద వర్గాలకు చెందినవారికి ఆ మార్కెట్ ఒక ఉపాధి కేంద్రంగా ఉందన్నారు. ముస్లింలు, బీసీలు, పేద కులాలకు ఆ మార్కెట్ ఒక ఆధారంగా దాన్ని అమ్మేసి వారందరినీ రోడ్డున పడేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశించారు. గుంటూరు పరిసరాల నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఎంతోమంది నిత్యం రైతులు తమ పంటలు అమ్ముకొనేందుకు నిత్యం పి.వి.కె.నాయుడు మార్కెట్ కు వస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా ఆస్తుల విక్రయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు అమ్మడంతో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ఈ ప్రభుత్వం అన్వేషించడం లేదని స్పష్టం చేశారు. కరోనాతో ప్రజలందరూ ఆందోళనతో ఉంటే ప్రభుత్వం అండగా నిలవాల్సిందిపోయి విద్యుత్ బిల్లు పెంచేసి ఇబ్బందిపెడుతోందన్నారు. మరో వైపు ప్రజా ఆస్తులను అమ్మేస్తోందని జనసేన నాయకులు, శ్రేణులు ప్రజా ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ చేస్తున్న దీక్షలు నా మనసును కదిలించాయన్నారు.