Shirdi Guru Purnima: దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఏపీకి చెందిన ఓ భక్తుడు శిరిడి సాయిబాబా కు భారీ ఖరీదైన కానుక సమర్పించుకున్నారు. ఏలూరు కు చెందిన భక్తుడు కోటి 30 లక్షల విలువచేసే 629 గ్రాముల బంగారం కిరీటాన్ని సాయిబాబాకు అందజేశారు. ఆయనతోపాటు మరో ఇద్దరు భక్తులు కూడా బాబాకు ఖరీదైన కానుకలను సమర్పించడం విశేషం. ఎన్టీఆర్ జిల్లాలోని ఆలయంలో బాబాకు కోటి 70 లక్షల రూపాయలతో కిరీటాన్ని సమర్పించారు. గురు పౌర్ణమి నాడు గురుదక్షిణ ఇచ్చుకుంటే మంచిది అని సెంటిమెంట్ ఉంది. అందుకే పెద్ద ఎత్తున బాబాకు వితరణలు చాటుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు భక్తులు.
* భారీగా భక్తులు..
గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి లోని సాయినాథ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి భక్తులు రావడంతో కిటకిటలాడింది షిరిడి. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన భక్తుడు బాబాపై తనకు ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. బాబాను గురువుగా భావించి గురుదక్షిణ గా ఖరీదైన కానుకను సమర్పించారు. ఏలూరు కు చెందిన శ్రీనివాసరావు కోటి 30 లక్షల విలువ చేసే 629 గ్రాముల బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందజేశారు. బాబాకు హారతి సమయంలో అలంకరించాలని షిరిడి సంస్థాన్ వారిని కోరారు. ఈ కిరీటం చుట్టూ నవగ్రహాలు, నవరత్నాలు, అమెరికన్ సి జెడ్ డైమండ్స్ తో తయారు చేసినట్లు తెలిపారు.
* బహుమతుల వెల్లువ
మరోవైపు జబల్పూర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓం ప్రకాష్ శర్మ ఎనిమిది లక్షల విలువైన 60 గ్రాముల బంగారు కిరీటాన్ని అందజేశారు. బరోడా కు చెందిన విజయ్ నాయక్ తొమ్మిది లక్షల విలువైన 51 గ్రాముల రెండు బంగారు ఓం అక్షరాలను అందించారు. షిరిడీలో మూడు రోజులపాటు గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. ప్రధానంగా ఈరోజు బాబాను గురువుగా భావిస్తారు. తోచిన విధంగా కానుకలను గురుదక్షిణ గా సమర్పిస్తుంటారు.
* ఏపీలో సైతం..
ఏపీలోనూ గురు పౌర్ణమి వేడుకలు సందర్భంగా బాబాకు పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చి సంతృప్తి పొందారు భక్తులు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి సాయి పురం కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయానికి కిలో బంగారంతో తయారుచేసిన కిరీటాన్ని భక్తులు అందజేశారు. భారీగా విరాళాలు సేకరించి ఈ కిరీటాన్ని తయారు చేయించారు. వజ్రాలతో పాటు తరుగు కలిపి మొత్తం కోటి 70 లక్షల రూపాయలతో ఈ కిరీటాన్ని తయారు చేయడం విశేషం. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ, భక్తులు కలిపి కిరీటాన్ని అలంకరించారు. బాబాను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.