Abhijit Dipke : ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. సిద్ధాంతాలు, విధానాల ఆధారంగా విపక్షాలు అధికార పక్షాన్ని, అలాగే ప్రజాప్రతినిధులు ప్రత్యర్థులను విమర్శించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛలో భాగమే. అయితే, ఈ విమర్శలు రాజకీయ పరిణితిని, సంస్కారాన్ని ప్రతిబింబించేలా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు, స్థాయి దిగజారే వ్యాఖ్యలకు వేదికగా మారకూడదు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే, సౌరబ్ దాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పొందుతున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకుల పేర్లను వాడుకుంటూ, ఈ రకమైన బెదిరింపు ధోరణిలో మాట్లాడటం వారి వ్యక్తిగత స్థాయిని మాత్రమే కాకుండా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తోంది.
రాజకీయ సంస్కృతి ఏమవుతోంది?
గతంలోనూ రాజకీయాల్లో తీవ్రమైన విభేదాలు ఉండేవి. కానీ, నాయకులు మాట్లాడే భాషలో ఒక గౌరవం, నియంత్రణ కనిపించేవి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో “ఎవరు ఎక్కువ ఘాటుగా మాట్లాడితే వారికి అంత ప్రచారం” అనే సంస్కృతి పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య విలువలు, కనీస రాజకీయ పరిణితి కొరవడుతున్నాయి.
ప్రధాని పదవి అనేది ఏ ఒక్క పార్టీకో లేదా వర్గానికో పరిమితమైంది కాదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాక్రోచ్ జనతాపార్టీకి ఇచ్చిన గౌరవాన్ని, సదరు నాయకులు నిలబెట్టుకోకపోతే ప్రశ్నించడానికి పద్ధతులు ఉన్నాయి. కానీ, స్థాయి మరచి బెదిరింపులకు దిగడం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజాస్వామ్య స్ఫూర్తియే.
భాషణలో నిగ్రహం, విమర్శల్లో హుందాతనం ఉన్నప్పుడే ఏ నాయకుడికైనా లేదా ఏ సంస్థకైనా ప్రజల్లో గౌరవం దక్కుతుంది. సీజేపీ ప్రతినిధులుగా ఉన్న అభిజీత్ దీప్కే, సౌరబ్ దాస్ లు తమ పదవులకు, స్థాయికి తగినట్లుగా వ్యవహరించడం శ్రేయస్కరం. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చేసే ఇటువంటి చవకబారు విమర్శలు, హెచ్చరికల వెల్లువకు స్వస్తి చెప్పినప్పుడే ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం సాధ్యమవుతుంది. హెచ్చరికలు చేయడం కంటే బాధ్యతాయుతంగా మాట్లాడటమే నిజమైన నాయకత్వ లక్షణం.
అభిజిత్ దీప్కే, సౌరబ్ దాస్ లు స్థాయి మరచి మాట్లాడుతున్నారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.