లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పలు రకాల సేవలు తిరిగి ప్రారంభించడానికి అవకాశం వచ్చింది. మే 3 వరకు కొనసాగనున్న రెండవ విడత లాక్డౌన్ కు మినహాయింపులలో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై
ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు పాటించాల్సిన విధానాలపై సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపించింది.
రెడ్జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తివంచవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 97 మండలాలను రెడ్ జోన్ లుగా గుర్తించారు. వీటిలో అత్యధిక మండలాలు గల జిల్లాలో వరుసగా కర్నూలు లో 17 మండలాలు, నెల్లూరు లో 14 మండలాలు, గుంటూరు లో 12 మండలాలు ఉన్నాయి.
మినహాయింపులు వర్తించేది వీటికే:
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు మినహాయింపు వర్తిస్తోందన్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్యకలాపాలు కొనసాగింపునకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే 20వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించాయి.