ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంకా చెప్పాలంటే.. దేశవ్యాప్తం అయిపోయింది. రాష్ట్రం దివాళా అంచున ఉందనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకోవడం.. కేంద్రం పరిమితి విధించడం.. జీతాల కోసం అవస్థలు పడడం.. వంటి విషయాలన్నీ మీడియాలో ప్రధాన వార్తలుగా వస్తున్నాయి. ఏపీ ఆర్థిక దుస్థితిపై ఈ స్థాయిలో చర్చ జరగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో.. ముందుగా ఈ సమాచారాన్ని బయటకు వెళ్లకుండా కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.
ఈ సమాచారం ఎక్కడి నుంచి బయటకు వెళ్తుందని ఆరాలు తీసి.. ముగ్గురు అధికారుల నుంచే వెళ్తుందని భావించి.. వారిపై వేటు వేశారనే చర్చ జరిగింది. కానీ.. సమాచారం బయటకు రావడం ఆగలేదు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను, జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టడం ఆపేశారు. అయినా.. ఆగడం లేదు. ప్రతీ సూక్ష్మమైన అంశాలు కూడా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. దీంతో.. ఈ సమాచారాన్ని కట్టడి చేసేందుకు మరో నిర్ణయం తీసుకుంది సర్కారు. ఇందుకోసం మౌకికంగా ఆదేశాలు జారీచేసినట్టుగా తెలిసింది.
ఆర్థికపరమైన విషయాలు చర్చించేప్పుడు కింది స్థాయి అధికారులు ఎవరూ ఉండొద్దని ఆదేశించారట. పలు సమావేశాల్లో కీలక అధికారులు సమర్పించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా.. సమాచారం బయటకు వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు.. సీఎంవోలో జరిగే సమీక్షల్లో ఆర్థిక అంశాల గురించి మాట్లాడొద్దని కూడా ఆదేశించారట. ఇతర ఉద్యోగులతోనూ ఈ విషయాలు మాట్లాడొద్దని చెప్పినట్టు సమాచారం. ఇంత చేసినా.. సమాచారం బయటకు రాకుండా ఆగట్లేదు!
ఎక్కడ లోపం జరుగుతోందని ఆరాతీస్తే.. రాష్ట్ర సచివాలయం నుంచి కాకుండా పీఎసీ, రిజర్వు బ్యాంకు వంటి సంస్థల నుంచి సమాచారం బయటకు వస్తోందని ఏపీ సర్కారు గుర్తించిందని తెలుస్తోంది. అందువల్ల ఆర్థికానికి సంబంధించిన సమాచారం ఆయా సంస్థలకు ఇవ్వకుండా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే.. ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా ఆలోచనలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కడుపులో ఉన్న రోగాన్ని తగ్గించుకునే మార్గం చూడాలేగానీ.. కప్పి పుచ్చుకోవడం ద్వారా నష్టమే ఎక్కువ కలుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. అయినా.. ప్రభుత్వ సంస్థలు ఒకదానితో ఒకటి అనుసంధానంగా ఉన్నప్పుడు.. సమాచారం బయటకు రాకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నాయి. ఆర్థిక సమస్యను అధిగమించే ఆలోచనలు వదిలేసి.. సమాచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం పాలనా తీరుకు అద్దం పడుతోందని విమర్శిస్తున్నాయి.