AP Cabinet Decisions : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో 45 అంశాలపై చర్చించారు. దాదాపు 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటి అనంతరం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు అని.. 2వ తేదీ ఆదివారం కావడంతో ఏపీలో పింఛన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు.
విశాఖ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆస్కార్ కొట్టిన ఆర్ఆర్ఆర్ టీంను అభినందనలు తెలిపారు. ఇక ఈ కేబినెట్ భేటిలో అత్యంత కీలకమైన అంశం.. విశాఖను రాజధానిగా ప్రకటించడం.. విశాఖను పారిశ్రామికవేత్తలు అంతా రాజధానిగా ఆహ్వానించారని జగన్, మంత్రులు తెలిపారు. విశాఖ కేంద్రంగానే పాలన సాగుతుందని జగన్ స్పష్టం చేశారు.
-జగన్ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
● పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
● ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం
● అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
● దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
● ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
● అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం
● ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం
● జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.
● ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
● హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం
● టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం