Homeఆంధ్రప్రదేశ్‌అమరావతి పోరు.. వైసీపీకే లాభం

అమరావతి పోరు.. వైసీపీకే లాభం

Amaravati protest
అమరావతి.. ఇప్పుడది ఏపీలోని ఒక్క వైసీపీకి తప్ప మిగితా పార్టీలన్నింటికీ హాట్‌ ఫెవరేట్‌. ఎందుకంటే.. ఇప్పుడు రాజకీయాలన్నీ అమరావతి వేదికగానే నడుస్తున్నాయి కదా. చంద్రబాబు అధికారంలో ఉండగా.. అమరావతి ఏపీ రాజధానిగా అనౌన్స్‌ చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చి అమరావతి కాదు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఇక అప్పటి నుంచి ఆ పంచాయితీ హైకోర్టులో నడుస్తూనే ఉంది. అందుకే.. అధికార పార్టీ మినహా మిగితా పార్టీలు ఇప్పుడు అమరావతిని ఓట్లను రాల్చే అక్షయపాత్రలా భావిస్తున్నారట.

Also Read: పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలు.. ఏం జరుగుతోంది?

అమరావతి అని పేరు వినపడగానే.. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు జగన్‌ గుర్తువస్తుంటారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలుగా ఏపీలో ఉన్నాయి. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగితే చుట్టుపక్కల జిల్లాల్లో కచ్చితంగా పొలిటికల్ మైలేజ్ వచ్చేది టీడీపీకే. మూడు రాజధానుల వల్ల జగన్ కి గరిష్ట లాభం ఉంది. అమరావతి చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాలను మినహాయించినా తొమ్మిది జిల్లాల మీద వైసీపీ కన్నేసి మరీ మూడు రాజధానులు పేరిట ట్రంప్ కార్డుని వాడుతోంది.

మరోవైపు బీజేపీ ఇప్పుడు అమరావతిని అస్త్రంగా ఎంచుకుంటోంది. ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజే అమరావతి రాజధాని విషయంలో ఒక్కో సారి ఒక్కో విధంగా ప్రకటన చేశారు. చివరికి ఇప్పుడేమో ఆయన అమరావతే మన రాజధాని అంటున్నారు. ఏపీలో బీజేపీ రాజకీయ భూమిక చూసినా, కేంద్రం దాగుడుమూతలు చూసినా, ఇక విభజన హామీల గురించి మాట్లాడుకున్నా కూడా కమలనాథుల మాటలను అమరావతి కోరుతున్న వారు పెద్దగా పట్టించుకోరు. అందువల్ల ఓట్లు రాల్చుకుందామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావు అన్న మాట నిజమనే తెలుస్తోంది.

Also Read: ఏపీలో మరో ‘దిశ’.. యువతి పాశవిక హత్య

ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏడాదిగా సాగిన అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం గురించి తన పార్టీ స్టాండ్ ఇది అని కచ్చితంగా ఇప్పటివరకు ఎప్పుడూ వివరించలేదు. లాంగ్ మార్చ్ చేస్తామని, కేంద్రాన్ని ఒప్పిస్తామని మాటలు బాగానే చెప్పారు. కానీ ఆచరణలో విఫలమయ్యారు. ఇప్పుడు అటూ ఇటూ తిరిగి అమరావతే దిక్కు అన్నట్లుగా జనసేన పోరాడుతోంది. దాని వల్ల జనసేనకు కలసివచ్చేది ఏముందో తెలియదు కానీ ఈ పార్టీలతో పాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వంటి పార్టీలు ఎంతగా మద్దతు ఇస్తే అంతలా టీడీపీకే ఈ పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది. ఎందుకంటే ప్రధాన సామాజికవర్గాలు అన్నీ టీడీపీతోనే ప్రయాణం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే రాజధాని కోసం అన్ని పార్టీలు అమరావతి వేదికగా కొట్లాడుతుంటే.. అది చివరికి వైసీపీకే లాభం చేకూర్చేలా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular