Homeజాతీయ వార్తలుTelangana BJP : బీజేపీకి 90 స్థానాలు పక్కానంట.. బండి సంజయ్‌ కాన్ఫిడెంట్‌ వెనుక కథేంటి?

Telangana BJP : బీజేపీకి 90 స్థానాలు పక్కానంట.. బండి సంజయ్‌ కాన్ఫిడెంట్‌ వెనుక కథేంటి?

Telangana BJP : దక్షిణ భారత దేశంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమలనాథులు తెలంగాణలో విజయానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు దాదాపు రెండేళ్లుగా భారీ కసరత్తు చేస్తున్నారు. ఇదే కాన్ఫిడెన్స్‌తో ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నిల్లో 90 స్థానాల్లో గెలుస్థామని ఆ పార్టీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ధఋమా వ్యక్తం చేస్తున్నారు.

-బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకత…
తెలంగాణలో 9 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్‌ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్‌ పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకే వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాగోస బీజేపీ భరోసా స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొంటున్న బండి సంజయ్‌ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. శనివారం ఒక్కరోజే జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్, రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లలో పాల్గొన్న బండి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

-గుంపులుగా వచ్చినా.. అధికారం మాదే..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ కలిసి గుంపుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయని బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వాళ్లు గుంపులుగా వచ్చినా.. తాము ఒంటరిగా పోటీ చేసి 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో పది లోక్‌సభ స్థానాలలో గెలుపు ఖాయమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

-బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకత..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు సంజయ్‌. అధికార పార్టీకి ప్రత్యమ్యాయం బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. బీజేపీ గెలిస్తే పింఛన్లు తొలగిస్తారని బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘మోటార్లకు మీటర్లు పెడతాం రుణాలు ఇవ్వండి’ అని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిందని తెలిపారు. మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి నెట్టింది కేసీఆరే అని పేర్కొన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తారీఖు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి దిగజార్చారని ఆరోపించారు.

-24 గంటల కరెంటు ఏమైంది?
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ సరఫరాపై ఏమైందని ప్రశ్నించారు బండి. సీఎం కేసీఆర్, మంత్రులు నోరు తెరిస్తే 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రగల్బాలు చెబుతున్నారని, మరి ఆ విషయానికి కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తను రాజీనామా చేస్తానని లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. నయీమ్‌ ఆస్తులు మొత్తం కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. నయీమ్‌ డైరీ ఎటు పోయిందని ప్రశ్నించారు.

-పైపుల కంపెనీలు పెట్టిన కేసీఆర్‌ కుటుంబం..
మిషన్‌ భగీరథ పేరుతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని రూ.45 వేల కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. ఆ సొమ్మును తన కుటుంబ సభ్యులే కాజేసేందుకు పైపుల కంపెనీలు పెట్టించారని బండి సంజయ్‌ ఆరోపించారు. దీంతో కోట్ల రూపాయలు కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకే మళ్లాయని పేర్కొన్నారు. అయినా.. ఇప్పటికీ ఇంటింటికీ నల్లా నీళ్లు రావడం లేదని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, కుటుంబ బాలనపై ఉన్న వ్యతిరేకత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తుందన్న ధీమాతో సంజయ్‌ ఉన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular