Homeజాతీయ వార్తలుప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా


భారత్‌లో నాలుగో విడత లాక్ డౌన్ మరో నాలుగు రోజులలో ముగుస్తుంది. ఇప్పటికే చాలావరకు సడలింపులు ఇచ్చారు. మరిన్ని ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. కానీ రోజు రోజుకు ఈ వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రోజులు గడిచేకొద్దీ కేసుల నమోదు సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఇప్పుడు ఈ వైరస్ తీవ్రంగా ఉన్న టాప్ 10 దేశాలలో ఒకటిగా భారత్ చోటు సంపాదించింది. మంగళవారం నాటికి దేశంలో 1,45,380 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 4,167 మంది వైరస్‌ భారిన పడి మృతిచెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 24 గంటల వ్యవధిలో 6,535 కేసులు నమోదు కాగా, 146 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది.

సోమవారం నాటికి భారత్‌ కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన టాప్‌ 10 దేశాల జాబితాలో చేరింది. అదే రోజువారీగా నమోదవుతున్న కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా భారత్‌ కంటే ఎక్కువ కేసులు వస్తున్న దేశాల్లో భారత్‌ కంటే అమెరికా, బ్రెజిల్‌, రష్యాలు ముందున్నాయి.

దీన్ని బట్టి చూస్తుంటే లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన తర్వాత దేశంలో కరోనా జడలు విప్పిన విషయం స్పష్టమౌతోంది. అప్పటివరకూ 2, 3, 4 వేల మధ్య నమోదవుతున్న కేసులు ఇటీవల వారం రోజులుగా మరింత తీవ్రమై 5, 6 వేలకు పైగా నిర్దారణ అవుతుండడం గమనార్హం.

దేశంలో కరోనా యాక్టివ్‌ కేసులు 80,722కు పెరగ్గా, రికవరీ అయిన వారి సంఖ్య 60,490 గా ఉదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనా బాధితుల్లో కోలుకుంటున్న వారి శాతం 41.61కు చేరిందని మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గ్లోబల్ రికవరీ రేటు కూడా దాదాపు అదే విధంగా ఉండడం గమనార్హం. మే 25 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా భారిన పడిన వారిలో 41.84 శాతం మంది కోలుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దేశంలో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో 1,695 మరణాలతో ఆ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్‌ (888), మధ్యప్రదేశ్ ‌(300), పశ్చిమబెంగాల్‌ (278), ఢిల్లీ (276)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో రెండు, మూడు అంకెల్లో ఉన్న మరణాల సంఖ్య కేరళలో నాలుగ్గా ఉంది.

దాదాపు 70 శాతం మేర మరణాలు బాధితులకు ఉన్న సహ అనారోగ్యాల కారణంగా సంభవించాయని మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇక కేసుల నమోదు గణాంకాలను పరిశీలిస్తే మహరాష్ట్రలో అధిక స్థాయిలో 52,667 పాజిటివ్‌ కేసులు తేలగా ఆ సంఖ్య తమిళనాడులో 17,082, గుజరాత్‌లో 14,460, ఢిల్లీలో 14,053, రాజస్థాన్‌లో 7,300, మధ్యప్రదేశ్‌లో 6,859, ఉత్తరప్రదేశ్‌లో 6,532గా ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular