పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో పలువురికి కరోనా సోకింది. అంతేకాకుండా పవన్ భద్రతా సిబ్బందిలోనూ కొందరు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పవన్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈమేరకు ఆ పార్టీ నేతలు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. డాక్టర్ల సూచన మేరకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. క్వారంటైన్ నుంచే పార్టీ కార్యక్రమాలను పవన్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు కొనసాగిస్తారని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. పవన్ క్వారంటైన్లోకి వెళ్లడంతో సినిమా షూటింగ్ లపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ తోపాటు.. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు పవన్ క్వారంటైన్లోకి వెళ్లడంతో షూటింగులకు బ్రేక్ పడే పరిస్థితి వచ్చింది.