TV9 Anchor Pratyusha: కొన్ని చెప్పుకోవాలి. కచ్చితంగా కొన్నింటి గురించి వివరించాలి. ముఖ్యంగా మీడియాలో ఈనాడు గురించి.. టీవీ9 గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి.
ప్రింట్ మీడియాలో ఈనాడు తీసుకొచ్చిన సంస్కరణలు.. మార్పులు.. ఇతర వ్యవహారాలు ఇప్పటికీ ఒక పాఠం లాగే ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 సృష్టించిన సంచలనం.. నెలకొల్పిన అద్భుతం.. ఇవన్నీ ఇప్పటికి ఒక పాఠం లాగే ఉంటాయి. ఈ రెండు సంస్థలు రెండు మాధ్యమాలలో ఒక వట వృక్షాల మాదిరిగా ఎదిగిపోయాయి. వీటి స్థానాన్ని భర్తీ చేయడానికి.. వీటి స్థానాన్ని ఢీకొట్టడానికి అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి అంటే దానికి ప్రధాన కారణం ఈ రెండే. ఎంతోమందికి ఉపాధి.. ఎంతోమందికి ప్రత్యామ్నాయ అవకాశాలను అందించిన ఘనత ఈ రెండు సంస్థలది.
ఈనాడులో ఇప్పటికీ పాతకాలపు నియమాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీవీ9 లో ఉన్న నియమాలు ఇప్పుడు కాస్త చెక్కు చెదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీవీ9 లో పనిచేసినవారు ముఖ్యంగా ఫ్రంట్ వింగ్లో ఉన్నవారు ఇతర సంస్థల్లో గాని.. ఇతర మాధ్యమాలలో గాని కనిపించేవారు కాదు. అయితే ఇప్పుడు ఆ నిబంధనలు పూర్తిగా తగ్గిపోయినట్టు కనిపిస్తోంది.
రవి ప్రకాష్ ఉన్నంతవరకు టీవీ9 లో ఈ నిబంధనలు బ్రహ్మాండంగా కొనసాగాయి. ఎప్పుడైతే మేనేజింగ్ ఎడిటర్ గా రజనీకాంత్ వచ్చారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. టీవీ9 లో పనిచేసే యాంకర్లు ఇతర మాధ్యమాలలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో దర్శనమిస్తున్నారు. ఆ మధ్య స్టార్ మా లో వచ్చిన ఓ రియాల్టి షోకు ఓంకార్ వ్యాఖ్యాతగా ఉండేవారు. ఆ షో కు టీవీ9 లో పనిచేసే దీప్తి.. ప్రత్యూష వచ్చారు. వాస్తవానికి వాళ్ళిద్దరూ ఇతర మాధ్యమాలలో కనిపించడం అదే తొలిసారి.
ఇప్పుడు మళ్లీ ప్రత్యూష ఓ పాపులర్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన జర్నీ.. టీవీ9లో ప్రవేశించిన విధానం.. వచ్చిన అవకాశాలు.. కెరియర్ ఎదుగుతున్న తీరు.. 20 ఏళ్లలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు.. సాధించిన విజయాలు అన్నిటిని పూసగొచ్చినట్టు వివరించారు. ఆమె చెప్పిన ప్రతి మాట స్ఫూర్తిదాయకమే. కాకపోతే టీవీ9 లో పనిచేసే ఒక టాప్ యాంకర్ ఇలా బయటికి రావడమే ఆశ్చర్యం. అన్ని విషయాలను ఎటువంటి సెన్సార్ లేకుండా చెప్పడం మరింత ఆశ్చర్యం.. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒకటి మాత్రం అనిపిస్తోంది ఎలా ఉండే టీవీ9.. ఇలా అయిపోయిందని.. మీడియాలో పనిచేస్తున్న వారికి.. మీడియాను దగ్గరుండి చూస్తున్నవారికి ఈ మార్పు కాస్త వింతగా.. కొత్తగానే ఉంటుంది. ఇక సామాన్య ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.