Jabardasth: సుమారుగా 12 ఏళ్ళ నుండి విరామం లేకుండా సాగుతున్న కామెడీ షో ఇండియా లో ఏదైనా ఉందా అంటే, అది ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో మాత్రమే. ఇప్పటి వరకు ఈ షో నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది కమెడియన్స్ టాప్ స్టార్స్ గా ఎదిగారు. కొందరు హీరోలు అయ్యారు, మరికొందరు డైరెక్టర్స్ కూడా అయ్యారు. కానీ కొందరు మాత్రం నాన్ స్టాప్ గా ‘జబర్దస్త్’ తోనే తమ ప్రయాణం సాగించారు. ముఖ్యంగా ఆటో రామ్ ప్రసాద్ , పొట్టి నరేష్ గురించి మాట్లాడుకోవాలి. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్.. ఈ ముగ్గురు పేర్లను వేరువేరుగా చూడలేము. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ఒకేసారి ‘జబర్దస్త్’ ద్వారా తమ కెరీర్ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వీళ్ళని పరిచయం చేసింది మరెవరో కాదు, ‘బలగం’ వేణు.
అలా మొదలైన వీళ్ళ జర్నీ, ఆ తర్వాత ఎంత అద్భుతంగా సాగిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్, ఆటో రామ్ ప్రసాద్ పంచులు, శ్రీను గెటప్పులు ప్రేక్షకుల చేత పొట్టచెక్కలు అయ్యేలా చేశాయి. అయితే సుధీర్ కి సినిమాల్లో అవకాశం రావడంతో ముందుగా అతను ఈ షో నుండి నిష్క్రమించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు గెటప్ శ్రీను కూడా సినిమాల్లో బిజీ అయిపోవడం తో , ఆయన కూడా జబర్దస్త్ ని వదిలేశాడు. ఇక మిగిలింది రామ్ ప్రసాద్ మాత్రమే. నిన్న మొన్నటి వరకు స్కిట్స్ వేసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన కూడా ఇప్పుడు కెరీర్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కాలని చూస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇక పొట్టి నరేష్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇతను ‘అమృతం’ సీరియల్ సమయం నుండే సినిమాలు , సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉండేవాడు. ఇక ఆ తర్వాత ‘జబర్దస్త్’ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన, అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా ఆ షోలో కమెడియన్ గా కొనసాగుతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన కూడా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అలా మంచి అవకాశం రాగానే, ‘జబర్దస్త్’ కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్లిద్దరు వదిలి వెళ్లిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ వారం ‘జబర్దస్త్’ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో లో ఆటో రామ్ ప్రసాద్ , నరేష్ ఇద్దరూ లేరు, దీన్ని బట్టే ‘మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్’ తో వీళ్ళ అగ్రిమెంట్ గడువు పూర్తి అయ్యినట్టుగా అర్థం చేసుకోవచ్చు.