Nagarjuna
Nagarjuna: కొన్ని సినిమాలను కథ కోసం చూస్తే మరికొన్ని హీరో, హీరోయిన్ ల కోసం చూడాలి అనిపిస్తుంది. ఇక కొన్ని సినిమాలు ఫ్యామిలీ కోసం చూడాలి అనిపిస్తుంది. కానీ అక్కినేని హీరోలు కలిసి నటించిన సినిమా మాత్రం అన్నింటి కోసం చూడాలి అనిపించింది అంటారు అక్కినేని అభిమానులు. అదేనండి మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, అఖిల్, నాగచైతన్య అందరూ కలిసి నటించారు. ఈ హీరోలే కాదు గతంలో నాగచైతన్య భార్య సమంత కూడా ఈ సినిమాలో నటించి మెప్పించింది.
ఈ సినిమా 2014 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఈ సినిమాని పలు థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే రీరిలీజ్ సందర్భంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకుంటూ.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని.. నాన్న ఆఖరి చిత్రమం అదేనని. ఎలాగైనా ఈ మూవీ క్లాసిక్గా నిలవాలని అనుకునేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అందరి కృషి వల్ల అనుకున్నది జరిగిందని.. దర్శకుడు విక్రమ్ కె.కుమార్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.. ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు అక్కినేని నాగార్జున. అప్పట్లో తన తండ్రి ఇబ్బంది పడుతూనే సెట్ కు వచ్చేవారు అని.. కానీ వచ్చిన తర్వాత అందరినీ నవ్వించేవారు అంటూ గుర్తు చేసుకున్నారు కింగ్. ఇక ఈ సినిమాను తండ్రికి పెద్ద స్క్రీన్ మీద చూపించలేదు అనే బాధ ఎప్పటికీ ఉంటుందన్నారు.
కింగ్ నాగార్జున మాత్రమే కాదు దర్శకుడు విక్రమ్ సైతం ఆ సినిమా జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. నాగేశ్వరరావు సర్కి స్క్రిప్టు వినిపించే సమయంలో.. తన చేయి తగిలి టేబుల్ మీద ఉన్న గ్లాసు కిందపడిందట. అంతేకాదు ఆ గ్లాసు పగిలిందట కూడా. ఆ శబ్దానికి అక్కడ పనిచేసే కొందరు బాయ్స్ ఏం జరిగిందో అనుకుంటూ కంగారుగా వచ్చి చూశారట. కానీ డోర్ దగ్గర ఉన్నవారిని లోపలికి రావొద్దు అన్నారట ఆయన. అంటే కథలో చాలా లీనం అయ్యారు అని తెలిపారు. తను స్టోరీ చెప్పడం పూర్తయ్యాక రూమ్ ను క్లీన్ చేశారట. ఆ రోజులను ఎప్పటికీ మరిచిపోలేను అంటూ పేర్కొన్నారు డైరెక్టర్. మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమాలో నటించి సూపర్ హిట్ ను సంపాదించారు అక్కినేని ఫ్యామిలీ.