సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ ‘ఒక్కడు’. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ మూవీ.. తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు ఉన్న రికార్డులను చెరిపేసింది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించారు. 2003లో వచ్చిన ఆ సినిమా గురించిన కీలక విషయాలు లేటెస్ట్ గా వెల్లడయ్యాయి. ఇటీవల నిర్మాత ఎం.ఎస్ రాజు కొన్ని విషయాలు పంచుకోగా.. తాజాగా రైటర్ తోట ప్రసాద్ మరికొన్ని విషయాలు షేర్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కున్న క్రేజ్ వేరే. అల్టిమేట్ జడ్జిమెంట్ ఇచ్చే నిర్మాతగా ఎం.ఎస్ రాజుకు పేరుంది. వెంకటేష్ తో తీసిని ‘శత్రువు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజు.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. దేవి, దేవిపుత్రుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? మనసంతా నువ్వే వంటి ఎన్నో హిట్స్ ఈ బ్యానర్ నుంచి వచ్చినవే.
అయితే.. ‘ఒక్కడు’ సినిమాను మహేష్ బాబును దృష్టిలోపెట్టుకునే రాసుకున్నారట గుణశేఖర్. అయితే.. పలు కారణాలతో మహేష్ వెంటనే ఓకే చెప్పలేదట. అప్పటికే బాబీ, టక్కరిదొంగ వంటి చిత్రాలు డిజాస్టర్ అయి ఉండడంతో.. ఈ ఫ్యాక్షన్ మిక్స్ చేసిన యాక్షన్ మూవీ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డాడట. అందుకే.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదట.
దీంతో.. ఈ చిత్రాన్ని పవర్ స్టార్ తో చేయాలనే ఆలోచనకు వచ్చాడట దర్శకుడు. ఆయనతో కుదరకపోతే వెంకటేష్ ను కూడా అనుకున్నారట. అయితే.. ఇదే సమయంలో నిర్మాత మరోసారి మహేష్ కు ఫోన్ చేయడంతో.. ఓకే చెప్పేశాడట. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని అందరికీ ముందుగానే ఒక నమ్మకం ఏర్పడిందని రైటర్ తోట ప్రసాద్ అన్నారు.