Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: సినిమా అడ్డాలో.. మహేష్ బాబు మల్టీప్లెక్స్..

Mahesh Babu: సినిమా అడ్డాలో.. మహేష్ బాబు మల్టీప్లెక్స్..

Mahesh Babu: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్.. ఈ పేరు చెప్తే.. సంధ్య, సుదర్శన్, ఓడియన్, దేవి వంటి థియేటర్లు గుర్తుకొస్తాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని థియేటర్లు ఈ పరిసర ప్రాంతంలో ఉంటాయి. మొత్తం కలిపి 15 కు పైగా థియేటర్లు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. కొత్త సినిమా విడుదలయితే చాలు ఇక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. వేలాదిమంది ప్రేక్షకులు ఇక్కడ సినిమా చూసేందుకు వస్తూ ఉంటారు. పలువురు హీరోల అభిమానుల బ్యాండ్ మోతలతో, పటాసుల చప్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేది. పెద్ద పెద్ద హీరోలు తమ చిత్రాలు విడుదలైన రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న థియేటర్లలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల సినిమాలు వందల రోజులు ఆడిన చరిత్ర ఉంది. పలు సినిమాలు సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ల వేదికగా జరుపుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

సినిమా అడ్డాగా పేరుపొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు మరో ఘనతను లిఖించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాంతంలో ఏఎంబీ క్లాసిక్ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నారట. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ 70 ఎంఎం స్థానంలో ఏఎంబీ క్లాసిక్ ను అందుబాటులోకి తెస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ థియేటర్ ను మొత్తం ఏడు స్క్రీన్ల కెపాసిటీతో నిర్మిస్తారని తెలుస్తోంది. దీనికి ఏఎంబీ క్లాసిక్ అని పేరు పెట్టినట్టు అక్కడ ఏర్పాటుచేసిన కటౌట్ల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో గచ్చిబౌలిలో 2018లో ఏఎంబీ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏఎంబీ క్లాసిక్ కూడా ఏషియన్ భాగస్వామ్యంతోనే నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినిమా అడ్డాగా పేరుపొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఇప్పటివరకు మల్టీప్లెక్స్ థియేటర్ లేదు. కాచిగూడ లో పాత పరమేశ్వరి థియేటర్ స్థానంలో ఒక మల్టీప్లెక్స్ ఉన్నప్పటికీ.. అది అంతగా నడవడం లేదు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏడు తెరలతో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తుండడంతో సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సుదర్శన్ థియేటర్ ను 1970 ఆగస్టు 15న ప్రారంభించారు. నరసింహులు అనే వ్యక్తి దీనిని నిర్వహించారు. ఆ తర్వాత ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో 2010 నుంచి ఇందులో ప్రదర్శన నిలిపివేశారు. తర్వాత ఆ థియేటర్ ను కూలగొట్టారు. ఆ స్థానంలో ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ నిర్మాణం జరుపుకుంటున్నది. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా సుదర్శన్ థియేటర్ లోనే చాలా రోజులు ఆడింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular