పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొవిడ్ బారిన పడి.. ఈ మధ్యనే కోలుకున్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత సిబ్బంది కొవిడ్ బారిన పడడంతో ఐసోలేషన్లోకి వెళ్లిన పవన్.. ఆ తర్వాత కొవిడ్ కన్ఫామ్ కావడంతో తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స తీసుకున్నారు. రామ్ చరణ్-ఉపాసనకు చెందిన అపోలో ఆసుపత్రి నుంచి వచ్చిన ఓ స్పెషలిస్టు ఆయన పక్కనే ఉండి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం.
పవన్ రెగ్యులర్ వ్యాయామంతోపాటు స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి కావడంతో త్వరగా కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన కోలుకున్నప్పటికీ చాలా నీరసించిపోయారట. నిజానికి కొవిడ్ సోకి కోలుకున్న ఎవరి పరిస్థితి అయినా ఇంతే. పవర్ స్టార్ కూడా ఇదే విధంగా చాలా వీకైనట్టుగా తెలుస్తోంది.
కొంతకాలంగా తీరికలేని పనులతో కూడా ఆయన అలసిపోయారు. ఒక దశలో ఉదయం ఒక షూటింగ్, మధ్యాహ్నం మరో షూటింగ్, సాయంత్రం రాజకీయాలు అన్నట్టుగా సాగింది పవన్ టైమ్ టేబుల్. ఈ విధంగా మూడు షిఫ్టుల్లో పనిచేయడంతో కనిపించని అలసటకు గురయ్యారు. ఇప్పుడు కొవిడ్ సోకడంతో మరింతగా బలహీనం అయ్యారట.
దీంతో.. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మే నెల మొత్తం రిలాక్స్ అయిన తర్వాత.. కొవిడ్ పరిస్థితులను బట్టి జూన్లో షూటింగులు ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల షెడ్యూల్స్ కూడా జూన్ తర్వాతే ప్లాన్ చేస్తున్నారట.