అన్ని రాష్ట్రాలు కరోనాతో ఫైట్ చేస్తుంటే.. ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం కరోనాతోపాటు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతలను కూడా కంట్రోల్ చేసే పనిని పెట్టుకుంది. ఆ వేడిలోనే ఈ వేడిని కలిపేసి టీడీపీ నేతల వేదనను అరణ్య రోదన చేస్తోందన్న వాదన ఉంది.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష టిడిపి నాయకులను ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి వేటాడేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి..
ఇప్పటికే ఇద్దరు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు లిస్టుల మరింత మంది టీడీపీ నేతలు ఉన్నారని అర్థమవుతోంది. గత ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరెస్ట్ అయిన తొలి టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు కావడం గమనార్హం.
ముఖ్యమంత్రి అయిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలను పున:పరిశీలించడమే కాకుండా, అవకతవకలు జరిగిన శాఖల్లో దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించుకున్నారు.
టిడిపి పాలనలో వివిధ పథకాలలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరగడం విశేషంగా మారింది.
అరెస్టుల సమయం కూడా అనేక సందేహాలను రేకెత్తించింది. కోవిడ్ -19 వ్యాప్తి తో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బల కారణంగా రాష్ట్ర సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది జరిగిందని ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు.
మొత్తం మీద, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సంక్షేమంలో తన మార్క్ చూపి ప్రజల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కడం ప్రారంభించాడు. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు, టీడీపీ నేతల అరెస్ట్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
-నరేశ్ ఎన్నం