సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో.. ఎవరు ఎవరితో జట్టు కడతారో చెప్పలేం. ఇది సాధారణ విషయమే. కానీ.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో చెదిరిపోవడం టాలీవుడ్లో గట్టిగానే చర్చల్లో నిలిచింది. దీనికి కారణం త్రివిక్రమ్ ఏడాది కాలంగా జూనియర్ కోసం వెయిట్ చేయడం ఒక కారణమైతే.. వీరి సినిమా కన్ఫామ్ అని ఎంతో కాలంగా వార్తల్లో నిలవడం. కారణాలు ఏవైనా.. ప్రస్తుతానికైతే ఆ సినిమా ఆగిపోయింది.
దీంతో.. చర్చల్లో ఉన్న మిగిలిన కాంబినేషన్ల పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా మొదలైంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో ఓ సినిమా ఉండబోతోందనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా మాదిరిగానే చాలా కాలంగా అనుకుంటూ వస్తున్నదే. హీరో-దర్శకుడు ఇద్దరూ సుముఖంగా ఉన్నారనే అంటున్నారు. మరి, కాలం కలిసి వస్తుందా? అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది.
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఇంకా ఫినిష్ చేయలేదు. కరోనాతో అవాంతరాలు వచ్చేశాయి. బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఈ నేపథ్యంలో.. రిలీజ్ దసరాను దాటుకొని, సంక్రాంతిని కాదని, సమ్మర్ కు షిఫ్ట్ కానుందనే వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత లాంగ్ టూర్ వేస్తాడు జక్కన్న. ఆ తర్వాత స్క్రిప్టు మీద కూర్చుంటే.. అంతా ఓకే అనుకుంటే.. అప్పుడు షూటింగ్ మొదలు పెడతాడు. అంటే.. 2022 అర్ధభాగం వచ్చేస్తుందన్నమాట. అప్పటి వరకు మహేష్ కమిట్ మెంట్స్ ఎలా ఉంటాయన్నది ప్రశ్న.
ఇక, టాలీవుడ్లో వినిపిస్తున్న మరో కాంబో బన్నీ-ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సమయంలోనే వీరిద్దరూ ఓ సినిమా చేయాలని అనుకున్నారట. ప్రస్తుతం సలార్ తో బిజీగా ఉన్న ప్రశాంత్.. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఖాళీగా లేడు. పుష్ప తర్వాత కొరటాలతో సినిమా చేయాల్సిన బన్నీ.. ఇప్పుడు క్వశ్చన్ మార్కులో ఉన్నాడు. మరో దర్శకుడితో టైఅప్ అయితే.. అది ఎప్పుడు పూర్తవుతుందో? తెలియని పరిస్థితి. అలాగని.. వచ్చే సమ్మర్ వరకు ఖాళీగా ఉండలేడు.
ఇవి కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ – ప్రభాస్ కాంబోలో సినిమా ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. సలార్, ఆదిపురుష్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయాల్సి ఉంది. కాబట్టి సందీప్ వంగా సినిమా ఉంటుందా? అన్నది కూడా డౌటే. ప్రస్తుతం కరోనా కారణంగా అన్నీ షూటింగులు దాదాపుగా ప్యాకప్ చేశాయి కాబట్టి.. పరిస్థితి ఇంకా క్లిష్టంగా తయారైంది. ఈ నేపథ్యంలో.. ఏ కాంబో మీద కూడా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది.