కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ, ఇతర కారణాల వల్ల దేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో 25 లక్షల మందికి రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం నిర్దేశించుకుంది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కేంద్రం రుణాలను మంజూరు చేయనుంది.
మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి రుణ హామీ లభిస్తుందని ఒక్కొక్కరికి గరిష్టంగా 1.25 లక్షల రూపాయల చొప్పున దాదాపు 25 లక్షల మందికి రుణాలను మంజూరు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా లోన్ డిఫాల్ట్ అమౌంట్లో 75 శాతం వరకు కేంద్రం గ్యారంటీ ఇస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
బ్యాంకుల నుంచి ఎంఎఫ్ఐలకు లభించే రుణాలపై వడ్డీ రేటు ఎంసీఎల్ఆర్ + 2 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని నిర్మలా సీతారామన్ సూచించారు. ఎంఎఫ్ఐలు అందించే రుణాలపై వడ్డీ రేటు ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ట వడ్డీ రేటు కన్నా 2 శాతం కంటే తక్కువగా ఉండాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎవరైనా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా తీసుకున్న రుణాన్ని మూడేళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ఇతర కీలక ప్రకటనలు సైతం చేశారు. టూరిస్ట్ గైడ్స్కు రూ.లక్ష వరకు రుణం, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో ఉన్న సంస్థలకు రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. హెల్త్ కేర్ రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు ఇవ్వనున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లక్షల మంది టూరిస్ట్లకు ఉచిత టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.