World Tiger Day : భారతదేశంలో పులి (Tiger) కి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనిని కేవలం ఒక వన్యప్రాణిగా మాత్రమే కాకుండా జాతీయ జంతువుగా గుర్తించారు. పర్యావరణ పరంగా కూడా పులి అత్యంత కీలకమైన జంతువు. అడవిలో జింకలు, అడవి పందులు వంటి శాకాహార జంతువుల సంఖ్యను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. పులుల సంరక్షణ కోసం భారత్ 1973లో ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది. దీని ద్వారా పులుల వేటను అరికట్టడం, వాటి ఆవాసాలను కాపాడటం వంటి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..
పులుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో సమన్వయ చర్యలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన టైగర్ సమ్మిట్ సందర్భంగా జూలై 29ను అంతర్జాతీయ పులుల దినోత్సవంగా పాటించాలనే నిర్ణయం తీసుకున్నారు. పులుల సహజ ఆవాసాలను కాపాడటం, వేటను అరికట్టడం వంటి లక్ష్యాలతో ఈ రోజును నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలోని అడవి పులుల సంఖ్య దాదాపు 70 శాతం భారత్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2022లో నిర్వహించిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రకారం భారత్లో పులుల సగటు సంఖ్య 3,682గా అంచనా వేశారు. కనిష్ఠ అంచనా 3,167 గా ఉంది. గరిష్ఠ అంచనా 3,925గా పేర్కొన్నారు. 2006లో 1,411గా ఉన్న పులుల అంచనా సంఖ్య 2022లో 3,682కు చేరింది. అంటే గత దశాబ్దాల్లో దేశంలో పులుల సంరక్షణ చర్యలు గణనీయమైన ఫలితాలను ఇచ్చాయని చెప్పొచ్చు.
దేశంలో పులుల సంరక్షణకు ప్రాజెక్ట్ టైగర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), రాష్ట్ర అటవీ శాఖలు చేపడుతున్న చర్యలు కీలకంగా మారాయి. పులుల ఆవాసాల రక్షణ, వేట నిరోధక చర్యలు, కెమెరా ట్రాప్లతో పర్యవేక్షణ, అడవుల్లో గస్తీ పెంపు, పులులకు అవసరమైన ఆహార జంతువుల సంరక్షణ వంటి చర్యలతో పులుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు పులుల సంరక్షణకు కీలక కేంద్రాలుగా ఉన్నాయి.
దేశంలోని పులుల జనాభాలో తాజా అధికారిక అంచనాల ప్రకారం మధ్యప్రదేశ్ దేశంలో అత్యధిక పులులున్న రాష్ట్రంగా నిలిచింది. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పులుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నల్లమల అడవులు, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధి, తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ వంటి ప్రాంతాలు పులుల ఆవాసాలుగా ఉన్నాయి. పులులు ఒక రాష్ట్ర సరిహద్దులోనే పరిమితం కాకుండా అడవుల మధ్య సంచరిస్తుంటాయి. అందువల్ల టైగర్ కారిడార్లను రక్షించడం, అడవుల అనుసంధానాన్ని కొనసాగించడం అత్యంత కీలకం. మనుషులు-పులుల మధ్య ఘర్షణలను తగ్గించడం కూడా భవిష్యత్ సంరక్షణలో ప్రధాన సవాలుగా మారుతోంది