EV Sales India : భారత్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2026 ఆగస్టు నెలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ (EV) రిటైల్ అమ్మకాలు ఏకంగా 51.89 శాతం వార్షిక వృద్ధితో 30,696 యూనిట్లకు చేరుకున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
అయితే నెలవారీగా చూస్తే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. 2026 జూలైలో దేశవ్యాప్తంగా 32,928 యూనిట్లు విక్రయించగా, ఆగస్టులో 30,696 యూనిట్లకు పరిమితమయ్యాయి. దీంతో నెలవారీ అమ్మకాల్లో 6.78 శాతం క్షీణత నమోదైంది.
పెరిగిన EV మార్కెట్ వాటా
మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఆగస్టులో 7.6 శాతంగా నమోదైంది. జూలైలో ఇది 7.9 శాతంగా ఉంది. అయితే గతేడాది ఆగస్టుతో పోలిస్తే EVల మార్కెట్ పెనిట్రేషన్ గణనీయంగా పెరిగింది. 2025 ఆగస్టులో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల పెనిట్రేషన్ 5.8 శాతం మాత్రమే ఉండగా, ఏడాది కాలంలో ఇది 7.6 శాతానికి చేరుకుంది.
టాటా మోటార్స్దే ఆధిపత్యం
భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆగస్టులో కంపెనీ 13,158 ఎలక్ట్రిక్ వాహనాలను రిటైల్ చేసింది. గతేడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 63.17 శాతం వృద్ధి.
టాటా తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా రెండో స్థానంలో నిలిచింది. కంపెనీ ఆగస్టులో 6,464 యూనిట్ల ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన మహీంద్రా అమ్మకాలు 56.17 శాతం పెరిగాయి.
MG అమ్మకాల్లో తగ్గుదల
JSW MG Motor India ఆగస్టులో 4,622 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. అయితే గతేడాది ఆగస్టుతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 17.77 శాతం తగ్గాయి.
ఇక భారత్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన VinFast ఆగస్టులో 2,199 యూనిట్ల రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. దీంతో భారత EV మార్కెట్లో పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇతర కంపెనీల అమ్మకాలు ఇలా..
మారుతి సుజుకి ఆగస్టులో 1,412 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 803 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే హ్యుందాయ్ EV అమ్మకాలు 17.06 శాతం పెరిగాయి.
కియా ఇండియా 645 యూనిట్లు, BYD ఇండియా 543 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయి. ప్రీమియం EV విభాగంలో BMW ఇండియా 274 యూనిట్లు, మెర్సిడెస్ బెంజ్ 114 యూనిట్లు, టెస్లా ఇండియా 116 యూనిట్లను రిటైల్ చేశాయి.
మొత్తంగా చూస్తే.. ఆగస్టులో నెలవారీ అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ, గతేడాదితో పోలిస్తే భారత EV ప్యాసింజర్ వాహన మార్కెట్ 52 శాతం దాదాపు వృద్ధి చెందడం ఈ విభాగంలో వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్నదానికి సంకేతంగా నిలుస్తోంది.