YSRCP Voting Percentage: మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయినా సరే దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. దానికి కారణం 40% ఓటు బ్యాంక్. ఆపై స్థానిక సంస్థల్లో ఇప్పటికీ పట్టు ఉంది అనేది ఆ పార్టీ ధీమా. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఆ 40% ఓటు బ్యాంకు స్థిరంగా ఉందా? అంటే అనుమానమే సమాధానం. ఎందుకంటే గడిచిన రెండు సంవత్సరాల్లో చాలా రకాల మార్పులు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కొన్ని వర్గాలపై విపరీతంగా ప్రభావం చూపాయి. డీఎస్సీ 2025నే తీసుకుందాం. అది దగా డీఎస్సీ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించేసరికి.. నిజంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు చాలామంది మీడియా ముందుకు వచ్చి మరి చెప్పారు.. తాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసామని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచామని.. కానీ మరోసారి ఆ పార్టీ వైపు చూసేది లేదు అని.. తేల్చి చెప్పారు చాలామంది. అది చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ చాలామంది వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది అనడం వాస్తవం.
* లడ్డూ కల్తీతో..
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఒక వర్గంపై తీవ్రమైన ప్రభావం చూపాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని చాలామంది నమ్మడం ప్రారంభించారు. కొంతమంది అగ్రవర్ణాలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగా మారిపోయారు. 2014 నుంచి 2024 వరకు మూడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన అగ్రవర్ణాల్లో చాలా మార్పు కనిపించింది. ఎప్పుడైతే లడ్డూ కల్తీ వ్యవహారం తేలిందో అప్పుడే వారంతా బాహటంగా వ్యతిరేకించడం ప్రారంభించారు.
* సంక్షేమంతో పాటు అభివృద్ధి..
ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన సంక్షేమ పథకాలు అందించారని నమ్మిన వర్గాలు ఆయన విషయంలో మరో మాట లేకుండా వ్యవహరించేవి. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాల విషయంలో సంతృప్తికరంగా అందించారని భావించిన వర్గాలు ఉన్నాయి. కానీ కూటమి వచ్చిన తరువాత అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల కొనసాగింపు తో చాలామంది పునరాలోచనలో పడ్డారు. ఒకవైపు అమరావతి రాజధాని, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, గ్రామాల్లో మౌలిక వసతులు.. వీటన్నింటికీ తోడుగా సంక్షేమ పథకాల అమలు చిన్న విషయం కాదు. మరోవైపు ఉద్యోగాల కల్పన, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీ ఇవన్నీ చాలా వర్గాల్లో మార్పు తెచ్చాయి. ఆ నలభై శాతం ఓటర్లలో సైతం చీలిక వచ్చింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 40 శాతం ఓటింగ్ నిలబడుతుందా? లేదా? అన్నది చూడాలి.